Reading Time: 2 minutes
Adnan Samis Incredible Weight Loss Journey From 230 Kg To 120 Kg

Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి తన మధురమైన పాటలతో ఎంతగా గుర్తింపు పొందారో అందరికీ తెలిసిందే. పాకిస్తానీ అయినా భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్ ఒకప్పుడు సుమారు 230 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ప్రాణాలకే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరిక, తండ్రి కళ్లలో కనిపించిన భయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అద్నాన్ సమి ఇటీవల జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత కఠినమైన దశను గుర్తుచేసుకున్నారు. ఒక దశలో ఆయన బరువు సుమారు 230 కిలోలకు చేరింది. నిలబడటం, కూర్చోవడం, నడవడం కూడా కష్టంగా మారడంతో దాదాపు మంచానికే పరిమితమయ్యారు. పరిస్థితిని చూసిన వైద్యులు ఆయన బరువు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని, తాను బతకడానికి కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండవచ్చని హెచ్చరించారు. ఆ మాట ఆయనకు ఎంత భయాన్ని కలిగించిందో, పక్కనే ఉన్న తండ్రి ముఖంలో కనిపించిన ఆందోళన కూడా అంతకన్నా తీవ్రంగా కుదిపేసింది.

మొదట వైద్యులు బహుశా విషయాన్ని ఎక్కువగా చెబుతున్నారని తన తండ్రిని ఓదార్చేందుకు అద్నాన్ ప్రయత్నించారు. కానీ ఆయన తండ్రి మాత్రం వైద్యుల హెచ్చరికను తేలిగ్గా తీసుకోలేదు. తన కుమారుడి పరిస్థితి నిజంగానే ప్రమాదకరంగా ఉందని చెప్పారు. తండ్రి కళ్లలోని నిస్సహాయత, కన్నీళ్లు అద్నాన్‌ను తీవ్రంగా కలచివేశాయి. అదే సమయంలో తండ్రికి తాను ఈ పరిస్థితిని మార్చుకుంటానని మాట ఇచ్చారు. ఆ ఒక్క వాగ్దానమే తన బరువు తగ్గించే ప్రయాణానికి అసలు ప్రారంభమని అద్నాన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రయాణం కూడా అంత సులభంగా సాగలేదు. బరువు తగ్గడం మొదలైన తర్వాత సోషల్ మీడియాలో అద్నాన్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం మొదలైంది. తన కష్టాన్ని అలా కొట్టిపారేయడం ఆయనను తీవ్రంగా బాధించిందని, బరువు తగ్గేందుకు ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోలేదని అద్నాన్ స్పష్టం చేశారు. కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామం, నిపుణుల పర్యవేక్షణలో తనలో మార్పు వచ్చిందని తెలిపారు.

బరువు తగ్గించే ప్రయాణంలో బయటివారికి కనిపించని మరో పోరాటం కూడా ఉందని ఆయన వివరించారు. ఒక వారం మొత్తం కఠినంగా వ్యాయామం చేసి, ఆకలిని నియంత్రించుకున్న తర్వాత బరువు చూసుకుంటే కేవలం అర కిలో మాత్రమే తగ్గిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అలాంటి సమయంలో ఇంత కష్టపడటం ఎందుకనే నిరాశ కలిగేదని తెలిపారు. అయితే తాను మాత్రం ప్రయత్నం కొనసాగించానని చెప్పారు. చివరకు అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, రోజువారీ కఠినమైన వ్యాయామం, నిరంతర క్రమశిక్షణతో అద్నాన్ తన బరువును సుమారు 230 కిలోల నుంచి 120 కిలోలకు తీసుకువచ్చారు. అంటే దాదాపు 110 కిలోల బరువు తగ్గారు. ఆయనకు తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చేసిన జీవన్మరణ పోరాటంలా సాగిందని చెప్పుకొచ్చారు.

అద్నాన్ సమి మూడు దశాబ్దాలకు పైగా తన మధురమైన గాత్రంతో, పియానో సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. లిఫ్ట్ కరా దే, కభీ తో నజర్ మిలావో, తేరా చెహ్రా, సున్ జరా, భర్ దో ఝోలీ మేరీ వంటి పాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పాప్ ఆల్బమ్స్ తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. లండన్‌లో జన్మించిన అద్నాన్ సామి 2016లో భారత పౌరసత్వం పొందారు. 2020లో కళారంగానికి చేసిన విశేష సేవలకు గాను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. అయితే ఆయన జీవితంలో అత్యంత చర్చనీయమైన అంశం మాత్రం బరువు తగ్గడం. 230 కిలోల నుంచి 120 కిలోలకు చేరిన ఈ మార్పు వెనుక వైద్య హెచ్చరిక కంటే తండ్రి కళ్లలో కనిపించిన భయం, తనకు తాను ఇచ్చుకున్న మాటతో లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకున్నారు అద్నాన్ సమి.