Reading Time: < 1 minute
Vijayawada Durga Temple Laddu Atm Machines Dasara 2026

Vijayawada Durga Temple: విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఒక తీపి కబురు అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నూతన విధానంలో భక్తులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి కాగానే భక్తుడి మొబైల్ ఫోన్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే నేరుగా లడ్డూ ప్రసాదం చేతికి అందుతుంది. ఈ మిషన్ల ద్వారా ఒక వ్యక్తి ఒక్కోసారికి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు పొందే వెసులుబాటు ఉంటుంది. దసరా సమయానికి ఆలయంలో మొత్తం 6 ఏటీఎం మిషన్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ సమయంలో దాదాపు 30 లక్షల నుండి 35 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదం విక్రయాలు జరుగుతాయి. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించి ప్రసాద విక్రయాలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ ఏటీఎం విధానం ఎంతగానో తోడ్పడనుంది.