
సమకాలీన ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగం అయింది. సిగ్నల్ లేని ప్రాంతాలలో నెట్ వాడకం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు.
గోడలే సిగ్నల్ పెంచితే..
సాధారణంగా వై-ఫై పరిధిని పెంచడానికి మనం బూస్టర్లు లేదా ఎక్స్టెండర్లు వాడుతుంటాం. కానీ జియో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాల్ పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి కొత్త సిగ్నల్స్ను ఉత్పత్తి చేయదు. మన ఇంట్లో ఇప్పటికే ఉన్న సిగ్నల్స్ను అద్దం వెలుగును రిఫ్లెక్ట్ చేసినట్లుగా సిగ్నల్స్ అందని మూలలకు రీడైరెక్ట్ చేస్తుంది. దీంతో ప్రతి గదిలోనూ అద్భుతమైన నెట్వర్క్ లభిస్తుంది.
ఈ టెక్నాలజీలో ప్రత్యేకమైన ప్యానెల్స్ ఉంటాయి. ఇవి ఇంట్లోని గాలిలో తిరిగే రేడియో సిగ్నల్స్ను పట్టుకుని నెట్వర్క్ తక్కువగా ఉన్న వైపు మళ్లిస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా పెద్ద పెద్ద టవర్లు లేదా అదనపు డివైజ్లను అమర్చాల్సిన అవసరం ఉండదు. గోడలకు అమర్చే చిన్న ప్యానెల్స్ ద్వారానే ఇంట్లోని ప్రతీ మూలకూ నెట్ స్పీడ్ సరి సమానంగా అందుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్..
ఈ స్మార్ట్ వాల్ను మరింత ప్రత్యేకంగా మార్చేది దీనిలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సిగ్నల్ ఏ వైపు ఎక్కువగా అవసరమో ఎక్కడ నెట్ స్లో అవుతుందో ఇది ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. దానికి తగ్గట్లుగా సిగ్నల్స్ దారిని వాటంతట అవే మార్చుకునేలా ఏఐ సహకరిస్తుంది. అంతేకాకుండా ఇది కొత్తగా సిగ్నల్ను తయారు చేయదు కాబట్టి కరెంట్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది.
భారత్లో సొంతంగా సిక్స్ జీ సాంకేతికతను అభివృద్ధి చేయాలనే జియో ఆలోచనలో ఈ స్మార్ట్ వాల్ ఒక భాగం. ప్రస్తుతం ఇది ప్రయోగాల దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇళ్లలో ఆఫీసుల్లో డెడ్ జోన్ల సమస్యను తుడిచిపెట్టేసి మనం ఉండే గోడలనే నెట్వర్క్లో భాగంగా మార్చే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా మార్చేయనుంది.