Reading Time: < 1 minute
Ap Assembly Monsoon Session Starts August 17 2026

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శనివారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ప్రకటన ప్రకారం, 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షాకాల సమావేశం కావడం విశేషం. సమావేశాల తొలిరోజైన 17వ తేదీ ఉదయాన్నే ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ఈ భేటీలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలి అనే అజెండాను ఖరారు చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు ముఖ్యమైన బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి.