Reading Time: < 1 minute
Telangana Govt Plan To Implement Free Urea Scheme For Farmers

తెలంగాణ రైతులకు సాగు ఖర్చు తగ్గించి, ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతున్న తరుణంలో.. ఈ ఉచిత ఎరువుల పంపిణీ రైతులకు తక్షణ ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read:Income Tax: ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేవి ఇవే..

గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ…. ఆర్థిక కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే.. ఆర్థిక శాఖ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

Also Read:Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..

దీని వల్ల ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం తప్పుతుంది. నగదు బదిలీలో జాప్యం జరిగినప్పటికీ.. వస్తు రూపంలో (యూరియా) సాయం అందడం వల్ల సాగు పనులు ఆగవు. సరైన సమయంలో ఎరువులు అందుబాటులోకి రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం ఈ పథకం కోసం అయ్యే మొత్తం ఖర్చు, జిల్లాల వారీగా ఉన్న యూరియా డిమాండ్ , పంపిణీ విధానంపై తుది కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో కీలక ముందడుగు పడినట్లవుతుంది.