Reading Time: < 1 minute
Bcci Center Of Excellence Controversy Bumrah Harshit Rana Injuries

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కీలక ఆటగాళ్ల వరుస గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల వంటి ప్రధాన ఆటగాళ్లు పునరావాసం (రిహాబ్) పూర్తి చేసుకుని జట్టులోకి వచ్చాక మళ్లీ గాయపడటంతో బిసిసిఐకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్‌నెస్ పరీక్షల ప్రమాణాలు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ పనితీరు, జాతీయ సెలెక్టర్ల మధ్య సమన్వయ లోపంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వీవీఎస్ లక్ష్మణ్‌ను కలసి ఆటగాళ్ల కోలుకునే ప్రక్రియను సమీక్షించారు.

ఈ విమర్శలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ, విమర్శలను తిరస్కరించారు. గాయాలు అనేవి ఏ క్రీడాకారుడి కెరీర్‌లోనైనా ఒక సహజమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులెవరో తేల్చి ‘బలిపశువు’ కోసం వెతకడం సరికాదని, ఎవరినీ నిందించకుండా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థపైనే దృష్టి పెట్టాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కేవలం గాయాల నుంచి కోలుకునే స్థానం మాత్రమే కాదని, క్రీడాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో దీని పాత్ర చాలా పెద్దదని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్‌కు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా మోకాళ్ల వాపుతో బాధపడుతుండగా,సాయి సుదర్శన్ కాలిన వేలి గాయంతో, హర్షిత్ రాణా , నితీష్ కుమార్ రెడ్డి కండరాల పట్టేత (మజిల్ స్ట్రెయిన్) సమస్యతో, వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో మైదానానికి దూరమయ్యారు. వీటితో పాటు ఆటగాళ్ల రీ-ఎంట్రీ గడువు, ఫిట్‌నెస్ ప్రమాణాల విషయంలో సెలెక్షన్ కమిటీకి, CoE కి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించకముందే కొంతమందిని మ్యాచ్‌లకు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, నిందలు వేసుకోవడం కంటే ఆటగాళ్ల గాయాల నిర్వహణను మరింత మెరుగుపరచడమే ప్రస్తుత లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు.