Reading Time: < 1 minute
Nalsar Students Oppose Cji Surya Kant Convocation Chief Guest

NALSAR: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) యూనివర్సిటీ 2026 కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడంపై వివాదం నెలకొంది. 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికిపైగా విద్యార్థులు యూనివర్సిటీ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు లేఖ సమర్పించారు.

యువతను ‘‘బొద్దింకలుగా’’ పిలవడం, ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు దాడికి సంబంధించి అంశాలపై సీజేఐ సరిగా వ్యవహరించలేదని విద్యార్థులు చెబుతున్నారు. జూలై 23న జరిగిన జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ మార్చ్‌లో పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలు చూడటానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ‘‘మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వాటిని చూడటానికి సమయం లేదు’’ అని ఆయన అన్నట్లు స్టూడెంట్స్ పేర్కొన్నారు.

భారత యువతను బొద్దింకలుగా పోల్చినట్లు విద్యార్థులు ప్రస్తావించారు. ఈ విషయాలపై సీజేఐ సున్నితత్వం చూపలేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ తేదీ, ముఖ్య అతిథి ఎంపికా ఇంకా అధికారికంగా పూర్తి కాలేదని, తుది నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులు లేఖలో కోరారు. తమ అభ్యంతరం సీజేఐ హోదాపై కాదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇటీవల విచారణల్లో ఆయన వ్యవహరించిన తీరు, తాము విశ్వసించే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉందా? అనే దానిపై ప్రశ్న అని తెలిపారు. పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలను పట్టించుకోనట్లు కనిపించే వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు అందుకోవడం.. తాము న్యాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉంటుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, దాదాపు రెండు వారాల క్రితం ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్‌ను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఆగస్టు 2న జరగాల్సిన ఈ కార్యక్రమానికి సీజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉందని సమచారం. నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో, భద్రతా ఏర్పాట్ల కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చర్చ జరిగింది.