Reading Time: 2 minutes
Cjp National Working Committee Former Aap Functionaries

CJP: నీట్ ఉద్యమంతో వచ్చిన ఊపు తర్వాత ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) తన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. యువత ఆశయాలకు పెద్ద పీట వేస్తూ ‘‘ప్రెజర్ గ్రూప్’’గా కొనసాగుతామని జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆగస్టు 6న కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆప్‌లో పనిచేసిన వారే సీజేపీలో ఉన్నారని విమర్శిస్తు్న్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, ఆప్‌కు డ్యూప్లికేట్ అని, B-టీమ్ అని అంటున్నారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని అభిజిత్ దీప్కే నివాసంలో రెండు రోజుల పాటు జరిగిన కోర్ టీమ్ సమావేశం తర్వాత ఈ కార్యకర్గాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సంస్థను విస్తరించడంతో పాటు ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజల్ని కలుసుకుంటామని ప్రకటించింది.

సీజేపీ కార్యవర్గంలో ఎవరున్నారు.?

నేషనల్ కన్వీనర్‌– అభిజీత్ దీప్కే (30)
కో-కన్వీనర్లుగా ఆశుతోష్ రంకా (30), సౌరవ్ దాస్ (27) ఉన్నారు.
నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్: అజింక్య షిండే (35)
ఆర్గనైజేషన్ కో-ఇన్‌ఛార్జ్: దీపక్ బలియాన్ (26)
నేషనల్ సెక్రటరీ: ఆఫ్రీన్ నవాజ్ (34)
మీడియా లీడ్: విజయ్ రెడ్డి మల్లంగి (30)
లీగల్ అఫైర్స్ లీడ్: రత్నా సింగ్ (31)
రిసెర్చ్ అండ్ పాలసీ లీడ్: వైష్ణవి గౌర్ (29)
టెక్నాలజీ లీడ్: రోహన్ దేశ్‌పాండే (31)
ఫైనాన్స్ లీడ్: యోగేశ్ ఇంగ్లే (33)

కీలక నేతలకు ఆప్‌తో సంబంధాలు:

సీజేపీ కార్యవర్గంలో ఉన్న నాయకులకు ఆప్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, నేషనల్ కన్వీనర్ అభిజిత్ దీప్కే 2020-23 వరకు ఆప్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారని తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ డిజిటల్, సోషల్ మీడియాలో పనిచేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా గతంలో ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆప్‌తో కలిసి పనిచేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి.

నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమితుడైన అజింక్య షిండే కూడా గతంలో ఆప్ మహారాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిపింది. ఆప్ గోవా సహ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.

సీజేపీ మీడియా లీడ్, దక్షిణ జోన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయ్ రెడ్డి మల్లంగి ప్రస్తుతం ఆప్ తెలంగాణతో అనుబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆప్ కార్యక్రమాలు, నిధుల సేకరణ, ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన ఆయన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని పేర్కొంది.

సీజేపీ ఫైనాన్స్ లీడ్ యోగేశ్ ఇంగ్లే మహారాష్ట్రలోని పుణెలో ఆప్ కార్యకర్తగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తూర్పు, ఈశాన్య జోన్ ఇన్‌ఛార్జ్ అంకిత్ భరద్వాజ్ గతంలో ఆప్ వాలంటీర్‌గా పనిచేసినట్లు సమాచారం.