Reading Time: 2 minutes
Juppalli Challenge Brs Debt 8 21 Lakh Crore

Jupally Krishna Rao : హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల పాలనలో కేటీఆర్, హరీష్ రావు చెప్పే అప్పుల లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై ఏకంగా రూ. 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు, బకాయిల భారాన్ని మోపిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై తాను రాసిన లేఖకు సమాధానం ఇచ్చానని హరీష్ రావు చెబుతున్నారే తప్ప, ఆ లేఖలో అంతా సోల్లు మాటలు తప్ప మరేమీ లేదన్నారు. ప్రెస్ క్లబ్‌లో ముఖాముఖి చర్చకు రావడానికి భయపడి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా హరీష్ రావు దాటవేశారని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు.

కాలేశ్వరం, మిషన్ భగీరథ కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన భారీ అప్పులను ఎవరు కడతారని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆయా కార్పొరేషన్ల ద్వారా అప్పులు కట్టకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ద్వారా ఎందుకు కట్టించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు గాను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ. 2 లక్షల 8 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన అప్పుల గురించే మాట్లాడకుండా, అసలు చర్చను పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు కేవలం రూ. 4 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశామని అబద్ధాలు ఆడుతున్నారని, ఇలాంటి అడ్డగోలు వాదనలు చేసేవారికి కొంచెమైనా సిగ్గు, శరం ఉండాలని మంత్రి ఘాటుగా విమర్శించారు.

పాలమూరు పౌరుషం ఉన్నవాడిని కాబట్టే ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని, తన ఇంట వంటా మాట తప్పే అలవాటు లేదని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తాను చెప్పిన రూ. 8.21 లక్షల కోట్ల అప్పుల లెక్క తప్పు అని నిరూపిస్తే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. “నేను చెప్పిన లెక్క తప్పు అని కేసీఆర్‌నైనా చెప్పమనండి.. నా సవాల్ నిజం కాకపోతే నేను క్షమాపణ చెబుతా, కానీ మీలాగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయను” అని మంత్రి పేర్కొన్నారు. హరీష్ రావు చెప్పేదే నిజమైతే, తన సవాల్‌ను స్వీకరించి, లెక్కలు తప్పని తేలితే రాజీనామా చేస్తానని ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి జూపల్లి నిలదీశారు.