Reading Time: 2 minutes
మాకు పాకిస్థాన్ అవసరం లేదు!.. నియంత్రణ రేఖ వద్ద ఎగిసిన నిరసన జ్వాలలు!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో రాజకీయ గందరగోళం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రావల్కోట్‌లోని ఈద్గా మైదానం వేదికగా, నియంత్రణ రేఖ (LoC) సమీపంలో వేలాది మందిగా తరలివచ్చిన జనం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక నిరసన చేపట్టారు. “పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదు.. మాకు పాకిస్థాన్ అవసరం లేదు!” అంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమ్మాన్ ఖాన్ చేసిన ప్రకటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికింది.

గత మూడు వారాలుగా రావల్కోట్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలను లొంగిపోయేలా చేయడానికి పాక్ పాలకులు నిత్యావసరాలు, గోధుమ పిండి, ఆహార సరఫరాలపై ఆంక్షలు విధించారని నిరసనకారులు ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అమన్ ఖాన్.. “మాకు మీ రేషన్లు అవసరం లేదు, జాగ్రత్త! భారత్‌తో వాణిజ్య మార్గాలను తెరిచే పరిస్థితి తెచ్చుకోవద్దు” అంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యను భారతదేశంతో మరింత సన్నిహిత సంబంధాలకు సంకేతంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

38 సూత్రాల డిమాండ్.. ఉగ్రవాద చట్టాల ప్రయోగం

ఈ నిరసన ఉద్యమం కేవలం ఆహార కొరతపైనే కాకుండా, దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ వివక్ష, ఆకాశాన్నంటుతున్న విద్యుత్ ధరలు, నిరుద్యోగంపై 38-సూత్రాల డిమాండ్ల పత్రం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. పీఓకేలో భారీగా జలవిద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, దానిని పాక్ ప్రావిన్సులకు మళ్లించి స్థానికులకు భారీ బిల్లులు బాదుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని అణచడానికి పాక్ ప్రభుత్వం ‘జేఏఏసీ’ సంస్థపై నిషేధం విధించి, అమన్ ఖాన్‌తో సహా పలువురు నేతలపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా, నిరసనల దృశ్యాలు బయటి ప్రపంచానికి తెలియకుండా జూన్ ఆరంభం నుండి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.

ఆజ్యం పోసిన పాక్ మంత్రి వ్యాఖ్యలు

“రావల్కోట్, మీర్‌పూర్ నివాసులు అసలైన కాశ్మీరీలే కారు” అంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ నిరసనల తీవ్రతను మరింత పెంచాయి. ఇస్లామాబాద్‌లో సైనిక పాలన లేదని, తాము ఏ నియంతను అంగీకరించబోమని నిరసనకారులు స్పష్టం చేశారు. ఒకవైపు అంతర్జాతీయ సమాజం ముందు సింధు జలాల ఒప్పందంపై మొసలి కన్నీరు కారుస్తున్న పాకిస్థాన్.. మరోవైపు పీఓకేలో సొంత ప్రజలపైనే అమానవీయంగా ఆహార, సమాచార దిగ్బంధనం విధించడం దాని ద్వంద్వ నీతిని ఎండగడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..