Reading Time: < 1 minute
AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: పిల్లల ప్రాణాలకు రక్షణగా నిలవవలసిన తల్లులే క్షణికావేశంలో తమ బిడ్డల ప్రాణాలను బలిగొoటున్న ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వెదుళ్లు వలస గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కూర్మాపు వరలక్ష్మి(28) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలకు బ్లేడుతో గొంతుకోసి హత్య చేసి తరవాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకి పాల్పడింది. పెద్ద కుమార్తె కూర్మాపు భవానికి 3 ఏళ్ల వయస్సు కాగా, రెండవ పాప కూర్మాపు చాందినికి 4 నెలల వయస్సు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. ఇంట్లో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వరలక్ష్మి నిద్రించగా హాలు బయట వరలక్ష్మీ అత్త లక్ష్మీ.. లక్ష్మీ తల్లి నిద్రించారు. అయితే ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో రక్తపు మడుగులో వరలక్ష్మి ఆమె పిల్లలు పడి ఉన్నారు.

అప్పటికే వరలక్ష్మి కొన ఊపిరితికొట్టిమిట్టాడుతుండగా స్థానికులు గమనించి ఆమెను అంబులెన్స్ లో శ్రీకాకుళం GGH కి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వరలక్ష్మి హాస్పిటల్ లో కోలుకుంటోంది. వరలక్ష్మి భర్త రమణ తెలంగాణాలోని నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వరలక్ష్మి అత్త లక్ష్మి వేధింపులే ఆత్మహత్య యత్నంకి కారణంగా చెబుతున్న స్థానికులు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం DSP వివేకానంద సైతం ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే అత్త లక్ష్మీ వేధింపులే ఘటనకు కారణం అని వరలక్ష్మి సోదరులు, సవతి తల్లి ఆరోపిస్తున్నారు. వరలక్ష్మికి ఇద్దరు కుమార్తెలే కావడంతో ఎప్పుడు వేదిస్తూ ఉండేదని వారు చెబుతున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేందుకు సోమవారం శ్రీకాకుళం GGH కి వరలక్ష్మి వెళ్ళిందని, మంగళవారం వస్తే ఆపరేషన్ చేద్దామని వైద్యులు చెప్పగా ఈలోగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి తన సవతి తల్లి, సోదరులతో కూడా వరలక్ష్మి ఫోన్ లో చాలా సేపు మాట్లాడింది. కానీ మరుసటి రోజు ఉదయానికి కాలనీ వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి