
CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపు, బడ్జెట్ లక్ష్యాల సాధనపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని MCRHRDలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారులు రామకృష్ణారావు మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు మరింత సీరియస్గా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ముఖ్యంగా HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ శాఖలతో పాటు ఆదాయ వనరులకు సంబంధించిన అన్ని విభాగాల్లో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయ వసూళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా “చేజింగ్ సెల్” ఏర్పాటు చేసి.. పెండింగ్ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారుల జాబితాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) వ్యవస్థతో అనుసంధానం చేయాలని చెప్పారు. దీంతో పారదర్శకత పెరగడంతో పాటు నిధుల వినియోగంలో సమర్థత సాధ్యమవుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
ఊహాజనిత అంచనాల ఆధారంగా కాకుండా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ రూపొందించాలని అధికారులకు సూచించిన సీఎం, వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.