
రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై నెలలో కూడా వర్షపాతం నిరాశాజనకంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని తెలిపింది.
ఈ ఏడాది ఎలాంటి వర్షాలు లేకుండానే జూన్ నెల ముగిసింది. 125 ఏళ్ల చరిత్రలో ఐదోసారి పొడి జూన్గా నమోదైందని ఐఎండీ తెలిపింది. జూలై నెలలో కూడా అంతంత మాత్రంగానే వర్షాలు ఉంటాయని చెప్పింది. ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. ఇది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని తెలిపింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో దృగ్విషయం బలపడుతూనే ఉండటంతో జూలైలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే జూలైలో వర్షపాతం 94 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. దేశంలో జూలైలో సగటున 280.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈసారి అది తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే ఒక శతాబ్దానికి పైగా కాలంలో అత్యంత పొడి జూన్ను ఎదుర్కొంటోంది. జూన్లో సాధారణం కంటే 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో 1901 తర్వాత ఇది ఐదవ అత్యంత పొడి జూన్గా నిలిచింది.
అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడటం వల్ల రాబోయే రోజుల్లో రుతుపవన పరిస్థితులలో స్వల్ప మెరుగుదల ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా రుతుపవన కాలం రెండవ భాగంలో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ‘పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ ఏర్పడవచ్చని.. ఇది రుతుపవనాలకు కొంత ఊపునిస్తుందని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ సూచించింది. అయితే ఎల్నినో మరింత బలపడితే ఈ ఉపశమనం తాత్కాలికమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.