Reading Time: 2 minutes
Bilahari Kausikan 1991 Singapore Airlines Hijack Benazir Bhutto Pakistan

1991 Hijack: ఒక అంతర్జాతీయ సమావేశంలో పాకిస్తాన్ పరువు ఘోరంగా పోయింది. సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాక్ రాజకీయాలు, సైన్యం, ప్రజల స్థితిగతుల గురించి నిజాలు మాట్లాడారు. ఇటీవల కాలంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చామని సంబరపడుతున్న పాకిస్తాన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘దౌత్యం ప్రజల కడుపు నింపదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పరిస్థితికి రాజకీయాలు, సైన్యమే కారణమని చెప్పారు.

1991లో పాకిస్తాన్ ఉగ్రవాదులు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఘటనను బిలహరి గుర్తు చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. దీంతో పాకిస్తాన్ పరువు సింధు నదిలో కలిసినట్లైంది. ఆ సమయంలో అప్పటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టోను సంప్రదించడానికి ప్రయత్నిస్తే.. ‘‘మేడం నిద్ర పోతున్నారు. ఆమెను ఇబ్బంది పెట్టలేము’’ అనే సమాధానం వచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు కాలక్షేపం చేస్తున్నారు తప్పితే మరేమీ కాదని ఆయన అన్నారు. బెనజీర్ భుట్టో పాకిస్తాన్‌కు 1988-1990, 1993-96 మధ్య ప్రధానిగా పనిచేశారు.

పాక్ సమస్యకు భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న సరిహద్దుల నుంచి వస్తున్నాయని ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించిన తర్వాత.. భౌగోళిక అంశాలు పాకిస్తాన్ సమస్యలకు కారణం కాదని, సైన్యం, దేశ రాజకీయ నేతల అసమర్థ పాలనా విధానాలు కారణమని చెప్పారు. పాక్‌ను మొదటి నుంచి తప్పుగా పాలిస్తున్నారని అన్నారు.

1991 హైజాక్ సమయంలో ఏం జరిగింది..?

పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఎంతటి ‘‘పనికిమాలిన వాళ్లో’’ వివరించడానికి కౌసికన్ 1991 హైజాక్ ఘటనను వివరించారు. 1991 మార్చి 26న, మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం (SQ117) నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 114 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో ఉన్న ఆ విమానం సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత ఆ నలుగురు ఉగ్రవాదులు ప్రయాణికులను బందీలుగా ఉంచుకున్నారు.

హైజాకర్లు విమానంపై మద్యం పోసి తగలబెడుతామని బెదిరించారు. హైజాకర్లు పాక్ ప్రధాని బెనజీర్ భుట్టోతో మాట్లాడాలని అనుకున్నారు. హైజాకర్లు భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)కి చెందినవారని తర్వాత అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఈ సమయంలో సింగపూర్ విదేశాంగ శాఖలో పనిచేసిన కౌసికన్‌కు ఈ హోస్టేజ్ క్రైసిస్‌ బాధ్యతల్ని అప్పగించారు.

మేడం నిద్రపోతున్నారు..

హైజాకర్లు భుట్టోతో మాట్లాడిన తర్వాత లొంగిపోతామని, లేకపోతే ప్రయాణికుల్ని చంపేస్తామని చెప్పారు. 1991లో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. బెనజీర్ భుట్టో ఆ సమయంలో సింధ్ లోని తన ఎస్టేట్‌లో ఉన్నారు. ఆమెను కౌసికన్ సంప్రదించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ సహాయంతో భుట్టో నివాసం ఫోన్ నెంబర్ కనుకున్నారు. తెల్లవారు 3 గంటల ప్రాంతంలో భుట్టోతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పనిమనిషి లేదా ఆమె ఇంటిలో సభ్యుడు ఫోన్ లిఫ్ట్ చేసి ‘‘మేడం నిద్రపోతున్నారు. వారిని డిస్టర్బ్ చేయకూడదు’’ అని చెప్పినట్లు కౌసికన్ వెల్లడించారు.

కమాండ్ ఆపరేషన్‌తో కథ సుఖాంతం..

చర్చలు విఫలం కావడంతో, చీకటిని ఆసరాగా చేసుకుని విమానంపై దాడి చేయాలని కమాండోలు నిర్ణయించుకున్నారు. స్టన్ గ్రెనేడ్లతో విమానం తలుపును పేల్చేసి, హైజాకర్లు అందర్ని హతమార్చారు. హైజాకర్లకు ఏం కావాలనే విషయం తమకు ఇప్పటికీ తెలియదని, వారంతా చనిపోయారని, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కౌసికన్ చెప్పారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లో ఫ్యూడలిజాన్ని స్పష్టంగా తెలియజేసిందని ఆయన అన్నారు.