Reading Time: 2 minutes

ఇదేం రనౌట్ రా బాబోయ్!.. ఇషాన్‌పై అభిషేక్ శర్మ రియాక్షన్ నెట్టింట హల్‌చల్

Caption of Image.

Abhishek Sharma vs Ishan Kishan: చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుకు మళ్లీ టాప్ ఆర్డర్ సమస్యలు ఎదురయ్యాయి. మ్యాచ్ ప్రారంభంలోనే కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. సాకిబ్ మహమ్మద్ వేసిన రెండో ఓవర్లోనే సంజు శాంసన్ అవుట్ కాగా, ఆ తర్వాతి రెండు బంతులకే ఇషాన్ కిషన్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. స్టేడియంలో ఇద్దరు బ్యాటర్ల మధ్య జరిగిన మిస్టేక్ తో ఇషాన్ కిషన్ రనౌట్ కావాల్సి వచ్చింది.

నెట్టింట అభిషేక్ శర్మ కామెంట్స్ వైరల్: 
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇషాన్ కిషన్ సింగిల్ కోసం పిలవగా, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని చూసి అక్కడ రన్ వచ్చే అవకాశం లేదని గ్రహించి ఇషాన్‌ను వెనక్కి వెళ్లమని సైగ చేశాడు. కానీ బంతి వైపే చూస్తున్న ఇషాన్ ఆ సిగ్నల్‌ను గమనించకుండా పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. కిషన్ సగం దూరం వచ్చాక అభిషేక్ గట్టిగా అరే యార్ క్యా కర్ రహా హై (అరే ఏం చేస్తున్నావ్ నువ్వు)? అని అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ గందరగోళంలో ఇషాన్ కిషన్ కేవలం రెండు బంతులు ఆడి డకౌట్ (0) గా వెనుతిరిగాడు.

అభిషేక్, శ్రేయస్, దూబే మెరుపులు: 
టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిని అధిగమిస్తూ సాకిబ్ మహమ్మద్, లియామ్ డాసన్ బౌలింగ్‌పై విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చివర్లో శివం దూబే కూడా 21 బంతుల్లో 42 రన్స్ కొట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 189/7 పరుగుల భారీ స్కోరును సాధించింది. కానీ రెండో ఇన్సింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి భారీ వర్షం పడటంతో.. ఎంతకీ వాన తగ్గకపోవడంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో తొలి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. 

 
 

 

©️ VIL Media Pvt Ltd.