
Hyderabad Osmania Hospital: భారతీయ వైద్య రంగంలో మునుపెన్నడూ ఎరుగని ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్లోని ప్రముఖ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోగికి ఐదు కీలక అవయవాలను విజయవంతంగా అమర్చి సరికొత్త రికార్డు సృష్టించారు ఉస్మానియా వైద్యులు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరుదైన, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతుండేవారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఉస్మానియా సర్జన్లు రంగంలోకి దిగారు. ఏకధాటిగా 36 గంటల పాటు జరిగిన అత్యంత సంక్లిష్టమైన విప్లవాత్మక శస్త్రచికిత్సలో రోగికి ఒకేసారి ఐదు అవయవాలను విజయవంతంగా మార్పిడి చేశారు.
జీర్ణాశయం , ద్వాదశ శుక్లం, క్లోమం , చిన్న ప్రేగు , కుడి వైపు పెద్ద ప్రేగు మార్పిడి చేసి వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. సాధారణంగా ఒకే అవయవ మార్పిడి చేయడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది ఒకే సర్జరీలో ఐదు అవయవాలను విజయవంతంగా మార్పిడి చేయడం భారతదేశ వైద్య చరిత్రలోనే ఇది మొదటిసారి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా, ప్రభుత్వ రంగంలో ఈ స్థాయి విజయం సాధించడం విశేషం.
తెలంగాణ ఆరోగ్య రంగంలో మరో మైలురాయి
ఈ అసాధారణ విజయంతో తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక వైద్య సేవలను పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తోందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. భారత వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఉస్మానియా ట్రాన్స్ప్లాంట్ టీమ్కు, ఇందుకు సహకరించిన సిబ్బందికి అన్ని వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bank Accounts: ప్రతి ఒక్కరికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉండాలి? 4 ఖాతాలు ఉంటే లాభమేంటి?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి