
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతుండగా, భారత విదేశాంగ శాఖ పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ చేసిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.
ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి
ఈ చారిత్రక గురుద్వారా కూల్చివేతపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం ప్రకటన విడుదల చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ఒక పవిత్రమైన సిక్కు మత స్థలానికి వ్యతిరేకంగా అత్యంత ఖండించదగిన, ముందస్తు ప్రణాళికతో జరిపిన విధ్వంసం. గురుద్వారాను ధ్వంసం చేయడం తీవ్ర విచారకరం. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం కానీ, అక్కడ మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన ‘ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు’ (ETPB) కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళనకరం” అని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. ఈ పోస్ట్లో ఈ సంఘటన ఏదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పాకిస్థాన్లో మైనారిటీలు, వారి పూజా స్థలాలపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని భారత్ బల్లగుద్ది చెప్పింది. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ధ్వంసమైన గురుద్వారాను వెంటనే పునర్నిర్మించాలని భారత్ డిమాండ్ చేసింది. మైనారిటీల రక్షణ విషయంలో పాక్ తన అంతర్జాతీయ, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని హితవు పలికింది.
తప్పు ఒప్పుకున్న పాక్ మంత్రి..
ఈ వివాదం అంతర్జాతీయంగా ముదరడంతో పాకిస్థాన్ పంజాబ్ ప్రాంత్ మైనారిటీ వ్యవహారాల మంత్రి రమేష్ సింగ్ అరోరా ఎట్టకేలకు స్పందించారు. 125 ఏళ్ల నాటి గురుద్వారా సింగ్ సభాలోని ఒక భాగాన్ని కూల్చివేసిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి వేడుకల కోసం పాక్ వెళ్లి వచ్చిన 346 మంది భారత సిక్కు యాత్రికుల బృందానికి మంత్రి రమేష్ సింగ్ అరోరా ఒక హామీ ఇచ్చారు. గురుద్వారాను తక్షణమే ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించి, పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ కూల్చివేత వెనుక ఉన్న ‘ల్యాండ్ మాఫియా’ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సిక్కు జత్థా సభ్యులకు హామీ ఇచ్చారు. పాక్ ప్రభుత్వం ఈ ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
Our response to media queries regarding reported demolition of 125-year-old Gurdwara in Pakistan
https://t.co/V7QUzNwuRm pic.twitter.com/WpWGONrnIp
— Randhir Jaiswal (@MEAIndia) July 1, 2026
