Reading Time: 2 minutes
Pawan Kalyan Warns Against Social Media Misuse Ap Govt Plans Strict Action

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛ పేరుతో దూషణలు, అసత్య ప్రచారాలు, మహిళలపై వేధింపులు, మతాలను అవమానించడం, డెత్ థ్రెట్స్, పరువు నష్టం వంటి చట్టవిరుద్ధ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులు ఉన్నాయని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. “ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు, అభిప్రాయ వ్యక్తీకరణకు పూర్తి స్థాయి గౌరవం ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, చట్టవ్యతిరేక చర్యలకు తావు లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలు, దుర్వినియోగాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్క్రీన్‌షాట్లు, లింకులు, వీడియోలు లేదా ఇతర డిజిటల్ ఆధారాలతో ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రతి జెన్యూన్ ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు.

పదేపదే ఫేక్ అకౌంట్ల ద్వారా అసత్య ప్రచారాలు, వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా నేరాలను అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. సోషల్ మీడియా నేరాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, అనామక బెదిరింపులు, పరువు నష్టం, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు, మతాలను అవమానించే వ్యాఖ్యలు, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రచారాలపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే ఫేక్ అకౌంట్లు, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్‌లైన్ ఇంపర్సనేషన్, అసభ్యకర కంటెంట్ ప్రచారం వంటి అంశాలపై ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్‌పై ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి సోషల్ మీడియా నేరాలపై వేగంగా స్పందిస్తామని చెప్పారు. ఫేక్ అకౌంట్లు, మహిళలపై అసభ్య పోస్టులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ లేదా చట్టవిరుద్ధ పోస్టులు కనిపిస్తే వాటిని షేర్ చేయకుండా, సంబంధిత ఆధారాలను భద్రపరచి అధికారులకు అందించాలని ప్రజలకు సూచించారు.

అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కేనని, అయితే అది గౌరవంతో, బాధ్యతతో, చట్టాన్ని గౌరవిస్తూ జరగాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదికగా ఉండాలని, విడదీసే సాధనంగా మారకూడదని అన్నారు. స్వేచ్ఛకు జవాబుదారీతనం తోడైతేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.