
దేశంలో తొలి హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్పై కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. తొలి కారిడార్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్లో భాగంగా సూరత్–వాపి మార్గంలో తొలి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్గంలో పనులు దాదాపుగా పూర్తయ్యాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీంతో 2027లో ఈ కారిడార్ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఈ మార్గంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు మార్గంగా సూరప్-వాపి నిలవనుంది.
కొలిక్కి వచ్చిన పనులు
గత కొన్నేళ్లుగా పలుమార్లు సూరత్–వాపి సెక్షన్లో నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. అయితే ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోయి పనులు వేగవంతమైనట్లు తాజాగా రైల్వేశాఖ ప్రకటన జారీ చేసింది. గణనీయమైన స్థాయిలో పనులు పూర్తయ్యాయని స్పష్టం చేసింది. జపాన్ టెక్నాలజీతో ఈ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. జపాన్ సాంకేతికతో పాటు ఆర్ధికంగా నిధులు కూడా సమకూర్చుతోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ మొత్తం 508 కిలోమీటర్ల ఉంటుంది. సివిల్ పనులు, వంతెనల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి పనుల్లో ముఖ్యమైన భాగం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో సూరత్-వాపి కారిడార్లో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. భూసేకరణ సమస్యలు, వివిధ సంస్థల నుంచి ఆమోదాలు, కోవిడ్ కారణంగా గతంలో ఈ ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అయితే గత రెండేళ్లుగా నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. గుజరాత్లో చాలా వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తవ్వడంతో నిర్మాణ కార్యకలాపాల్లో వేగం పుంజుకుంది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్లో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. దీంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది. జపాన్కు చెందిన ప్రఖ్యాత షింకన్సెన్ టెక్నాలజీతో ఈ కారిడార్ నిర్మిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 7 కారిడార్ల నిర్మాణం
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొత్తం 7 బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించింది. అందులో అహ్మదాబాద్-ముంబై ప్రాజెక్ట్ తొలుత ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె, బెంగళూరు-చెన్నై ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారిడార్లలో అలైన్మెంట్ సర్వే జరుగుతున్నాయి. ఇక భూసేకరణ ప్రక్రియ కోసం వివిధ రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. భూసేకరణలో రాష్ట్రాల సాయం తీసుకోవడం ద్వారా అడ్డంకులు ఉండవని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక పర్యావరణ, పరిపాలన అనుమతులు లాంటివి పూర్తయిన తర్వాత ఈ కారిడార్ల పనులు ప్రారంభం కానున్నాయి.