Reading Time: < 1 minute
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇక సర్కార్ బడి టీచర్లకు డబుల్ బెనిఫిట్స్

హైదరాబాద్, జులై 2: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అందుతున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికీ విస్తరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన తొలి ఈ-కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు పోషకాహార లోపానికి గురికాకుండా ఉండేందుకు చాలా కాలంగా మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టగా, ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల విద్యార్థులకూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అదే సదుపాయాన్ని విద్యార్థులకు బోధించే సిబ్బందికీ వర్తింపజేయాలని నిర్ణయించడం విశేషంగా మారింది.

ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి ప్రతిరోజూ ఉచితంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో విద్యాసంస్థల్లో సిబ్బంది ఎక్కువ సమయం అందుబాటులో ఉండటంతో పాటు విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఇది దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.