
అరేబియా సముద్రంలో అత్యవసరంగా నీటిపై ల్యాండింగ్ చేస్తుండగా యూఎస్ నేవీకి చెందిన MH-60S సీ హాక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ సిబ్బందిలో ఒకరు గల్లంతవ్వగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యూఎస్ నేవీ అధికారిక ప్రకటన ప్రకారం, జూలై 1వ తేదీన తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదం శత్రుదేశాల దాడి కారణంగా జరగలేదని నేవీ ప్రాథమికంగా ధృవీకరించింది.
ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని గాయాలతో సురక్షితంగా రక్షించగా, గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలోని యూఎస్ నేవీ నౌకలు, ఇతర వనరులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని సైనిక అధికారులు తెలిపారు.
కూలిపోయిన ఈ హెలికాప్టర్ను అమెరికాకు చెందిన అధునాతన నిమిట్జ్-క్లాస్ విమాన నౌక ‘యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్’ పై మోహరించారు. ఇరాన్తో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, మధ్యప్రాచ్యానికి అమెరికా పంపిన రెండు కీలక విమాన వాహక నౌకలలో ఇది ఒకటి. ఈ నౌక ఏప్రిల్ 2026 నుండి ఈ ప్రాంతంలో మోహరించాయి. మధ్యప్రాచ్యంలోని యూఎస్ ఐదవ ఫ్లీట్ బహ్రెయిన్లోని నావల్ సపోర్ట్ యాక్టివిటీ నుండి పనిచేస్తూ, పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర పరిధిలోని హోర్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మండేబ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల భద్రతను పర్యవేక్షిస్తుంది.
హెలికాప్టర్లను నీటిపై దించడం అనుభవజ్ఞులైన పైలట్లకు కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. హెలికాప్టర్ల పైభాగం బరువుగా ఉండటం వల్ల నీటిలో పడిన వెంటనే అవి తలక్రిందులుగా మునిగిపోయే అవకాశం ఎక్కువ. అమెరికా, ఇరాన్ల మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి, ఇరాన్ ఓడరేవులపై ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం కుదిరినప్పటికీ, అడపాదడపా హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో అమెరికా బలగాలు అక్కడ తీవ్ర అప్రమత్తతతో ఉన్నాయి. ఈ సున్నితమైన సమయంలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..