Reading Time: 2 minutes
Shreyas Iyer On Vaibhav Suryavanshi Debut India Vs England T20

భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్‌తో బుధవారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడా లేదా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వనప్పటికీ.. కొద్ది నెలల క్రితమే టీ20 ప్రపంచకప్ గెలిచిన సీనియర్ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుండి, అతడిని బరిలోకి దించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో బాగా పెరుగుతోంది. అయితే, ఒకవేళ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఓపెనర్లుగా ఉన్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీని విడదీయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ అయ్యర్ స్పందిస్తూ, జట్టులోని ఆటగాళ్లందరికీ సురక్షితమైన వాతావరణం, తగినన్ని అవకాశాలు కల్పించడం ముఖ్యమని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు ఈ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో బాగా తెలుసని, వారు జట్టుకు బలమైన స్తంభాలని కొనియాడారు.

సూర్యవంశీ రేపటి మ్యాచ్‌లో ఆడతాడా అనే ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. “రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మా వ్యూహాలు చాలా రహస్యంగా ఉంచుతాము. తుది జట్టు కలయికను ముందే వెల్లడిస్తే ప్రత్యర్థి జట్టుకు వ్యూహాలు తెలిసిపోయే అవకాశం ఉంది. వైభవ్ చాలా చిన్న వయస్కుడు, అతనికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాణిస్తాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, సూర్యవంశీ అరంగేట్రం కోసం బయట నుండి ఒత్తిడి వస్తోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు, తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పారు. దీని ప్రకారం రేపు కూడా సూర్యవంశీకి నిరీక్షణ తప్పేలా లేదు. అయితే అయ్యర్ మాట్లాడిన మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ కు ఛాన్స్ ఇవ్వకపోతే.. ఐర్లాండ్ పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఐర్లాండ్ చేతిలో భారత్ అనుకోకుండా ఎదుర్కొన్న సిరీస్ ఓటమిపై అయ్యర్ స్పందించారు. ఆ ఓటమి అవమానకరం కాదు కానీ, చాలా బాధాకరమని అన్నారు. ఐర్లాండ్ జట్టు అన్ని విభాగాల్లో భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని, పిచ్‌లను అంచనా వేయడంలో, సరైన వ్యూహాలు అమలు చేయడంలో తాము వెనుకబడ్డామని అంగీకరించారు. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌ను ఐర్లాండ్ 2-0తో ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ నుండి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఈ తప్పులను ఇంగ్లాండ్ సిరీస్‌లో సరిదిద్దుకుంటామని శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.