
హిందూ వివాహ వ్యవస్థపై గుజరాత్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ‘సప్తపది’ (ఏడు అడుగులు) వంటి సాంప్రదాయ ఆచారాలు, వేడుకలు నిర్వహించకపోతే, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఆ హిందూ వివాహం చట్టబద్ధంగా చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ, సాంప్రదాయ వేడుకలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని శుద్ధి చేసి, పరివర్తన చెందిస్తాయని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
యునైటెడ్ కింగ్డమ్ (UK) లో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే వ్యక్తికి, అహ్మదాబాద్కు చెందిన ఒక మహిళకు మధ్య జరిగిన వివాదంలో జూన్ 23వ తేదీన హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తన అనుమతి లేకుండా, మోసపూరితంగా వివాహ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తామిద్దరం ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు జరగలేదని సోనార్ కోర్టుకు తెలిపారు. తమ మధ్య ఎలాంటి పెళ్లి వేడుకలు జరగలేదని సదరు మహిళ కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది. అయినప్పటికీ, వారి వివాహాన్ని రద్దు చేయడానికి నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుబట్టింది.
హిందూ వివాహ చట్టం – సెక్షన్ 7
హిందూ వివాహాన్ని సంపూర్ణం చేయడానికి, చెల్లుబాటు అయ్యేలా చేయడానికి సప్తపది వంటి సాంప్రదాయ ఆచారాలు ఖచ్చితంగా జరగాలని చెప్పే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. పవిత్ర అగ్ని సాక్షిగా వధూవరులు ఏడు అడుగులు వేయడం ద్వారానే ఆ బంధానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదా వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో ఈ ప్రాథమిక అంశమే లోపించిందని కోర్టు తేల్చింది.
“హిందూ వివాహం అనేది కేవలం ‘పాటలు, నృత్యాలు’, ‘విందులు, వినోదాల’ కోసం జరిగే సందర్భం కాదు. అది ఒక వాణిజ్య లావాదేవీ కూడా కాదు. ఇది ఒక స్త్రీ, పురుషుడు కలిసి ఒక పవిత్రమైన బంధంలోకి ప్రవేశించి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి జరిగే గంభీరమైన సంఘటన. హిందూ సంప్రదాయంలో భార్యను అర్ధాంగినిగా భావిస్తూనే, ఆమెకు ప్రత్యేక గుర్తింపు, సమాన భాగస్వామ్యం ఇస్తారు. యువతీ యువకులు వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు ఈ వ్యవస్థ పవిత్రతను అర్థం చేసుకోవాలి.” అని ధర్మాసనం హితవు పలికింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..