
Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గన్పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్పార్క్కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని ఆధారాలతో వస్తామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గన్పార్క్, ప్రెస్క్లబ్, తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… ‘ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర అంశాలపై అన్ని ఆధారాలతో గన్పార్క్కు వస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు అక్కడే ఉండాలి’ అని సవాల్ విసిరారు. ప్రజల ముందే వాస్తవాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అయితే తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్కు బయల్దేరిన హరీశ్రావును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అప్పుల అంశంపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
గన్పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలు, సవాళ్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం గన్పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్క్లబ్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.