
భారత్లో వాట్సాప్ ప్రవేశపెట్టబోతున్న కొత్త యూజర్నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ను ప్రస్తుతం అమలు చేయొద్దని మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై మూడు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని కూడా నోటీసు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వాట్సాప్లో ఇకపై మొబైల్ నంబర్ను షేర్ చేయకుండా ప్రత్యేక యూజర్నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసే అవకాశం కల్పించే కొత్త ఫీచర్ను మెటా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. అయితే భారత్లో ఈ ఫీచర్ అమలుకు ముందు భద్రత, గోప్యత, వినియోగదారుల రక్షణ అంశాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. యూజర్నేమ్ విధానం ద్వారా సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు తప్పుడు గుర్తింపులతో ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందా? అనే అంశంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మోసపూరిత ఖాతాలను గుర్తించడం కష్టమవుతుందా? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూజర్నేమ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? అందులో ఎలాంటి భద్రతా చర్యలు ఉంటాయి? దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారు? అనే అంశాలపై మూడు రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించింది. అంతేకాకుండా ఈ సమీక్ష పూర్తయ్యే వరకు భారత్లో ఈ ఫీచర్ను విడుదల చేయవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం.
మెటా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం.. రాబోయే నెలల్లో ఈ యూజర్నేమ్ ఫీచర్ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు యాప్లో ప్రత్యేక యూజర్నేమ్ను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే యూజర్నేమ్ సృష్టించడం తప్పనిసరి కాదు. గరిష్టంగా 35 అక్షరాల వరకు యూజర్నేమ్ను ఎంపిక చేసుకోవచ్చు. అవసరమైతే దాన్ని మార్చుకోవచ్చు లేదా తొలగించుకోవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ నంబర్కు బదులుగా యూజర్నేమ్ను షేర్ చేసి చాట్ ప్రారంభించవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్లాక్, రిపోర్ట్ వంటి భద్రతా సౌకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని మెటా తెలిపింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఉపయోగిస్తున్న యూజర్నేమ్లను వాట్సాప్లో కూడా వినియోగించే అవకాశాన్ని క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, సంస్థాగత ఖాతాలకు కల్పించనున్నట్లు మెటా వెల్లడించింది. ఖాతాల కేంద్రం ద్వారా అన్ని మెటా ప్లాట్ఫారమ్లలో ఒకే యూజర్నేమ్ను ఉపయోగించే వెసులుబాటు కూడా ఇవ్వనుంది.
దేశంలో డిజిటల్ మోసాలు, ఆన్లైన్ మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో.. వినియోగదారుల గోప్యతను కాపాడటంతో పాటు భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా కొత్త ఫీచర్లు అమలవుతున్నాయో లేదో నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.