
Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఆ భారం చివరికి ప్రజలపైనే పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మావిగన్ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమని ప్రభుత్వం చెబుతోందని, తాము గతంలో సూచించిన ప్రాంతాల్లో కూడా అది భాగమేనని అన్నారు. అయితే అసలు ప్రశ్న కోర్ ఏరియా ఎక్కడ ఉందనేదేనని సజ్జల పేర్కొన్నారు. రాజధాని పరిధిలో రైతులకు తిరిగి ఇవ్వాల్సిన భూములను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, కానీ రైతులను ప్రభుత్వం చివరి ప్రాధాన్యంగా చూస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.47 వేల కోట్ల వరకు అప్పులు తీసుకువచ్చిందని సజ్జల తెలిపారు. అదే నిధులతో మచిలీపట్నం పోర్టు, మెడికల్ కళాశాలలు, హంద్రీ-నీవా ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అనేక కీలక ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నిస్తున్నామని, కానీ తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా అధికార పార్టీ నాయకులు విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం సహజమని, దానిని సహించలేని పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణ వ్యయాలపై కూడా సజ్జల సందేహాలు వ్యక్తం చేశారు. ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల డబ్బుతో చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 40% మంది ప్రజలు ఓటు వేసిన ప్రధాన రాజకీయ పార్టీగా అధికార పార్టీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు తమకు ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఉందని, అలాంటి పరిస్థితిలో రాజధాని కోసం మరో రూ.2 లక్షల కోట్ల వరకు భారం మోపితే ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రజా ధనంతో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.