
Team India Playing 11 Changes: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో టీ20 సమరానికి ముందు టీం మేనేజ్మెంట్ సంచలన నిర్ణయాలకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ వర్షార్పణమైన నేపథ్యంలో, శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగే రెండో పోరులో బలమైన ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు భారత జట్టులో మూడు భారీ మార్పులు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా ఒక యువ సంచలనం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
బెంచ్ వీడనున్న 15 ఏళ్ల వండర్ కిడ్.. ఫ్యాన్స్ కల నెరవేరేనా..?
ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఈ అద్భుతమైన ప్రతిభావంతుడిని బెంచ్కే పరిమితం చేయడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి: ఇంగ్లాండ్తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
లెంజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం వైభవ్ను ఎక్కువ కాలం పక్కన పెడితే అతడిపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా జరిగే రెండో మ్యాచ్లో అతనికి తుది జట్టులో చోటు కల్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మారనున్న ఓపెనింగ్ జోడీ.. బ్యాటింగ్ ఆర్డర్లో పెను మార్పులు!
వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకురావడమే కాకుండా, ఓపెనింగ్ బాధ్యతలను కూడా అతనికే అప్పగించాలని కోచ్, కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు. విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల భారత బ్యాటింగ్ ఆర్డర్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుత ఓపెనర్ సంజూ శాంసన్ను మూడో స్థానంలో, మూడో స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ను మిడిల్ ఆర్డర్లో అంటే నాలుగు లేదా ఐదో స్థానంలో పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. అయితే ఈ సరికొత్త ప్రయోగం కోసం స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వక తప్పడం లేదు.
స్పిన్ విభాగంలో కొత్త వ్యూహం.. ఆల్రౌండర్కు లైన్ క్లియర్!
కేవలం బ్యాటింగ్ విభాగంలోనే కాకుండా బౌలింగ్ బలాన్ని పెంచేందుకు కూడా మార్పులు జరుగుతున్నాయి. గత మ్యాచ్లో ఆడిన స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్లలో ఒకరికి విశ్రాంతి నివ్వనున్నారు. మాంచెస్టర్ పిచ్ పరిస్థితులను బట్టి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బ్యాకప్తో పాటు పరుగులను నియంత్రించగల నమ్మకమైన స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దించాలని టీమిండియా గట్టిగా భావిస్తోంది. ఈ మూడు కీలక మార్పులతో ఇంగ్లాండ్కు గట్టి షాక్ ఇవ్వాలని భారత్ చూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..