
- మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం
- కేసీఆర్ పశుపతి అయితే.. రేవంత్ బూతుపతా ? : మాజీ మంత్రి హరీశ్రావు
కరీంనగర్, వెలుగు : ప్రకృతి వల్ల వచ్చే ఎల్నినో కంటే రాష్ట్రానికి సీఎం రేవంత్రెడ్డి రూపంలో వచ్చిన ‘రాజకీయ ఎల్నినో’నే పెద్ద ప్రమాదం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చని, మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లకు రిపేర్లు చేయకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్ అవగాహన సదస్సులో హరీశ్ రావు మాట్లాడారు.
రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని, మూడు విడతల రైతుబంధు బకాయిలు చెల్లించలేదని, యాసంగి బోనస్ ఇవ్వలేదని, రైతు బీమా నిలిపివేసి వేలాది కుటుంబాలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ‘కేసీఆర్ను పశుపతి అయితే… రేవంత్ బూతుపతా’ అని ప్రశ్నించారు. మేడిగడ్డలో దెబ్బతిన్నది రెండు పిల్లర్లేనని, వాటికి రెండున్నరేండ్లుగా రిపేర్లు చేయకుండా పెండింగ్ పెట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడురామకృష్ణారావు పాల్గొన్నారు.
సింగరేణిని కాంగ్రెస్ సర్కార్ఆగం పట్టిస్తోంది
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బుధవారం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో సంస్థ స్థితిగతులు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంతకుముందు శ్రీరాంపూర్జీఎం ఆఫీస్వద్ద సింగరేణి ఆఫీసర్ల రిలే దీక్ష సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… రెండున్నరేండ్లలో సింగరేణిని ఆగం చేశారని, ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆదానీ, అంబానీలకు అమ్మేస్తారన్నారు.
సింగరేణి స్కాంలకు సూత్రధారి రేవంత్ రెడ్డేనని.. అసెంబ్లీలో చర్చ పెడితే నిరూపించేందుకు సిద్దమని, నిరూపించలేకపోతే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ‘రేవంత్ రెడ్డి… నీ బావమరిదికి సింగరేణిలో ఎక్సెస్ రేటుతో టెండర్ ఇచ్చింది నిజమా కాదా..? నిజం కాకుంటే రాజీనామా చేసేందుకు నేను రెడీ.. లేకుంటే టెండర్ రద్దు చేయడానికి నీవు సిద్దమా’ అని సవాల్ చేశారు. అసిఫాబాద్ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీమంత్రి ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు సుమన్, దివాకర్ రావు, చిన్నయ్య, మధు పాల్గొన్నారు.