Reading Time: 2 minutes
India Monsoon Revival Heavy Rainfall July First Half Imd Forecast

Monsoon 2026: శతాబ్ద కాలంలోనే అత్యంత పొడి వాతావరణం నమోదైన జూన్ నెల తర్వాత, ఎట్టకేలకూ భారత్‌ నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. బలమైన పునరాగమనం (రివైవల్) దిశగా ఇవి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే 15 రోజులు దేశానికి అత్యంత కీలకమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కాలంలో ఏర్పడే పలు వాతావరణ వ్యవస్థల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాల రాకకూ ఇది మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆకస్మిక మార్పునకు వాతావరణంలో అరుదుగా జరిగే కొన్ని మార్పులే ప్రధాన కారణం. ఒకే సమయంలో దాదాపు సమాంతరంగా రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు ఫోర్‌కాస్ట్ మోడల్స్ సూచిస్తున్నాయి. అందులో ఒకటి మధ్య భారతదేశంపై, మరొకటి బంగాళాఖాతంలో ఏర్పడనున్నాయి. వీటికి తోడు ఉత్తర భారత్ మీదుగా రుతుపవన ద్రోణి (monsoon trough) కూడా స్థిరపడనుంది. ఈ వ్యవస్థల కలయిక వల్ల జూలై మొదటి పక్షంలో రుతుపవనాల కదలికలు గణనీయంగా పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో వాయవ్య భారత్‌లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ రుతుపవనాల పునరాగమనం మొదటగా పశ్చిమ తీర ప్రాంతంలో (West Coast) కనిపిస్తోంది. కేరళ, తీరప్రాంత కర్ణాటక, గోవా, మహారాష్ట్రలలో అప్పుడే భారీ వర్షాలు ముమ్మరమయ్యాయి. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు బలంగా వీస్తుండటంతో, వారం మధ్యలో పశ్చిమ కనుమల (Western Ghats) ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వర్షపు మేఘాలు దేశం లోపలి భాగాలకు వేగంగా విస్తరించనున్నాయి. జూలై 1-2 తేదీల నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ జంట అల్పపీడనాల వల్ల వాతావరణంలోకి భారీగా తేమ చేరడమే దీనికి కారణం. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, స్థానికంగా వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు, ఈ సీజన్‌లో సుదీర్ఘకాలంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఉత్తర భారతదేశంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. జూలై 1-2 తేదీల్లో హర్యానా, పంజాబ్, ఢిల్లీ-NCR పరిసర ప్రాంతాలలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

రుతుపవన ద్రోణి క్రమంగా దక్షిణం వైపు తన సాధారణ స్థానానికి చేరుకోవడంతో వర్షాలు మరింత క్రమబద్ధంగా మారనున్నాయి. జూలై 3 నుంచి జూలై 6 మధ్య కాలంలో ఈ తేలికపాటి జల్లులు కాస్తా.. విస్తారమైన మోస్తరు నుంచి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. ఇది ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల అధికారిక విస్తరణకు (సెట్ అవ్వడానికి) దారితీస్తుంది. నిజానికి దేశానికి ఈ వర్షాలు అత్యంత అవసరమైన సమయంలో వస్తున్నాయి. జూన్ నెల ముగిసే సమయానికి దేశంలో రికార్డు స్థాయిలో 40 శాతం వర్షపాతం లోటు నమోదైంది. 1901 తర్వాత ఇది ఐదో అత్యంత పొడి జూన్ నెలగా నిలిచింది. నేలలో తగినంత తేమ లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ విత్తనాలు నాటే ప్రక్రియ కూడా బాగా నెమ్మదించింది. అందువల్ల, జూలై మొదటి రెండు వారాల్లో కురిసే నిరంతర వర్షాలు వ్యవసాయానికి ప్రాణాధారంగా మారనున్నాయి. ఇవి జలాశయాలను నింపడంతో పాటు ఉత్తర, మధ్య భారతదేశంలో నెలకొన్న తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రయాణాలకు ఆటంకాలు కలగడం, వరదలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ.. వారాల తరబడి ఆలస్యమైన రుతుపవనాలు ఎట్టకేలకు తమ అసలైన రూపంలోకి వస్తుండటం కోట్ల మంది ప్రజలకు, రైతులకు ఒక పెద్ద ఊరట అనే చెప్పాలి.