Reading Time: < 1 minute
AP Rain Alert: బలపడతున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.  దీని ప్రభావంతో శనివారం (04 జూన్) అల్లురి, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

శనివారం మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు.