
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందా? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటర్లే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయా? కులాలు వేరైనా…. నినాదం ఒకటే ఉండటం వెనకున్న కారణాలేంటి? ఏయే కులాలతో పొలిటికల్ గేమ్ని రసవత్తరంగా మారుస్తున్నాయి పార్టీలు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం మళ్ళీ ఊపందుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాపు సామాజిక వర్గం సమావేశం, ఆ వెంటనే శెట్టి బలిజ సమావేశం జరగడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఈ రెండు సమావేశాల్లోనూ ప్రభుత్వంపై విమర్శలు, ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు నాయకులు. కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది వైసీపీ. ఆ పార్టీ కాపు నాయకులంతా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసంలో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కాపులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాత్రం సాయికృష్ణ ఎపిసోడ్లో నో కాంప్రమైజ్ అన్నట్టు మాట్లాడ్డం కూడా చర్చనీయాంశమైంది. నేరస్తులు ఏవరైనా.. ఏ కులమైనా తొక్కిపట్టి నార తీస్తామని పవన్ అనడం గురించి కూడా మాట్లాడుకున్నారట వైసీపీ కాపు నాయకులు. కుల రాజకీయాలు చేయబోనన్న పవన్ వ్యాఖ్యలపై ఒక వర్గానికి చెందిన కాపులు అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం దారుణమంటూ పవన్ కనీసం ఖండించలేదని, సీఎం చంద్రబాబు పరామర్శించినా…జనసేన వైపు నుంచి రియాక్షన్ లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము జనసేన పార్టీకి చెందిన వారమని చెప్పుకుంటున్న సాయికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేయకపోవడం ఏంటంటూ తప్పుపడుతున్నారు వైసీపీ కాపు నాయకులు. గోదావరి జిల్లాల్లో మరో బలమైన సామాజిక వర్గం శెట్టిబలిజలు.
ఓట్ల పరంగా వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శెట్టిబలిజ కుల సంఘం నాయకులు రాజమండ్రిలో సమావేశం అవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. బీసీలపై రాజకీయ కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ, వీటిని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శెట్టిబలిజ నేతలు. రాజమండ్రిలో రెండు కేసులు ఉన్న రౌడీ షీటర్ పీత రామకృష్ణపై పీడీ యాక్ట్ నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ పీడీ యాక్ట్ను పది రోజుల్లో తొలగించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని అల్టిమేట్ జారీ చేశారు వైసీపీ శెట్టిబలిజ నాయకులు. ఇక ఇదే సమయంలో ఆ పార్టీ రౌడీషీటర్లను వెనకేసుకుని వస్తోందంటూ ఆందోళన నిర్వహించాయి టీడీపీ శ్రేణులు. రాజమండ్రిలో వివాదస్పదంగా మారిన ఈ వ్యవహారంతో పరిస్థితులు ఎలా మారతాయోనన్న డిస్కషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఈ పరిణామాలతో గోదావరి జిల్లాల్లో కుల రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా అన్న అను డౌట్స్ కూడా పెరుగుతున్నాయి. కాపు, బీసీ సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఈ యాక్షన్కు టీడీపీ, జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది కూడా కీలకంగా మారింది. వరుసగా జరుగుతున్న సామాజిక వర్గాల సమావేశాలు రాజకీయ సమీకరణలను మార్చగలవా? లేక సాధారణ రాజకీయ కార్యక్రమాలుగానే మిగిలిపోతాయా? అన్న ప్రశఅనలకు సమాధానాలు దొరకాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.