
ప్రపంచదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాలు, ప్రవాస భారతీయులతో ముఖాముఖి సమావేశాల లక్ష్యంగా ప్రధాని మోదీ 6 రోజుల పర్యటన సాగనుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఈ మూడు దేశాల ప్రధానుల ఆహ్వానం మేరకు జరిగే ఈ పర్యటనలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మోదీ కీలక చర్చలు జరపనున్నారు
ఇండోనేషియా పర్యటన
ఇండోనేషియా గణతంత్ర అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత ఇది ప్రధానమంత్రి మోదీ నాలుగో పర్యటన కాగా, తొలి ద్వైపాక్షిక సందర్శనగా ప్రత్యేకత సంతరించుకుంది.జకార్తాలో అధ్యక్షుడు ప్రబోవోతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. ఇంతేకాకుండా, జకార్తాలో ప్రవాస భారతీయుల భారీ సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ప్రధానమంత్రి ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించి, భారత్-ఇండోనేషియా చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రతిబింబింపజేస్తారు.
ఆస్ట్రేలియా పర్యటన
ప్రధని మోదీ జూలై 8-10 తేదీలలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్లో పర్యటించనున్నారు. ఇక్కడ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు..ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్తో కూడా సమావేశం అవుతారు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయుల భారీ సమావేశాన్ని ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగిస్తారు..
న్యూజిలాండ్లో మోదీ చరిత్రాత్మక పర్యటన
జూలై 10-11 తేదీలలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ సందర్శించడం ఇదే మొదటిసారి.ఆక్లాండ్లో ప్రధానమంత్రి లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి, వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సమీక్షించనున్నారు. వ్యాపార, క్రీడా ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి, ప్రవాస భారతీయుల భారీ సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.ఈ మూడు దేశాల పర్యటన భారత్ ఇండో-పసిఫిక్ వ్యూహంలో ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తుంది..తూర్పు దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత దృఢపరచడంతో పాటు, ప్రాంతీయ స్థిరత్వానికి భారత్ కృషి చేస్తోందని ఈ పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి.