Reading Time: < 1 minute
పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో అపచారం.. గాలిగోపురం ఎదుట అర్ధరాత్రి ఇదేం పని!

విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సింహగిరిపై తీవ్ర అపచారం చోటుచేసుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొండపై ఉన్న గాలిగోపురం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించింది ఓ మహిళ. అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. సౌజన్య రాజకుమారి అనే యువతి జూన్ 29 అర్ధరాత్రి గాలిగోపురం వద్ద కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో సింహాచలం ఆలయ అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. దేవస్థాన ఆగమ నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆలయ ఈవో వెంకటరావు స్పష్టం చేశారు. కొండపై జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్స్ లాంటి వాటికి దేవస్థాన నియమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ఈవో వెంకటరావు సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మహిళపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, అర్ధరాత్రి వేళ ఆ మహిళకు సహకరించిన ఆలయ సిబ్బందిపై కూడా విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఆ సమయంలో డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును తక్షణమే విధుల్లోంచి తొలగించాలని సంబంధిత సెక్యూరిటీ ఏజెన్సీకి ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Sacrilege At Simhachalam

Sacrilege At Simhachalam

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..