
ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? రాష్ట్ర స్థాయి ఐక్యత ఎలా ఉన్నా…. అక్కడి లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయా? జనసేన ఎమ్మెల్యే టీడీపీ లీడర్స్ని లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? పార్టీని బలహీనపరుస్తున్నారంటూ తమ్ముళ్లు తమ అధిష్టానంతో మొరపెట్టుకున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కుమ్ములాటల సంగతి?
కనీసం పదిహేనేళ్ళపాటు కూటమి ఐక్యత చెక్కు చెదరకూడదని పై స్థాయిలో నేతలు పదేపదే చెబుతుంటే…. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాత్రం సీన్ రివర్స్లో ఉందట. ఇక్కడ టీడీపీ, జనసేన మధ్య కుమ్ములాటలు నిత్యం రచ్చకెక్కి రెండు పార్టీల అధిష్టానాలను ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా అవనిగడ్డ టీడీపీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో….కేడర్తో సమన్వయం చేసుకుని ఒక్క తాటి మీదికి తెచ్చే నాయకులు కరవయ్యారని అంటున్నారు.
ఇక్కడ జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా గెలిచారు మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్.గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనది. ఇక 2024లో కూటమి పొత్తు కుదిరినప్పుడు టీడీపీలోనే ఉన్నారాయన. ఒప్పందంలో భాగంగా అవనిగడ్డ జనసేన కోటాలోకి వెళుతుందని తెలియగానే… సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది మండలి వర్గం. అలాగే లోకల్ జనసైనికుల్ని ఉద్దేశించి చేసిన విమర్శలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే… చివరికి అనూహ్యంగా ఆయనే జనసేన టికెట్ దక్కించుకోవడం, ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయిన పరిణామాలు. ఇక అప్పటిదాకా తెలుగుదేశంలోనే ఉన్నందున ఇబ్బందులేం రావని, టీడీపీ కేడర్ని కూడా బుద్దపప్రసాద్ కలుపుకునిపోతారని అంతా భావించారు.
కానీ…. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదన్నది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల అధిష్టానాల దృష్టికి వెళ్ళాయట. ఒకప్పుడు అదే కేడర్తో కలిసి పని చేసిన నాయకుడు ఇప్పుడు వాళ్ళనే ఎందుకు కలుపుకుని పోలేక పోతున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బుద్ద ప్రసాద్ జనసేనలో చేరిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ని నియమించలేదు. దీంతో మండల పార్టీ నాయకులే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు ఎమ్మెల్యే బుద్దప్రసాద్ టిడిపి ద్వితీయ శ్రేణి నాయకుల్ని జనసేనలోకి తీసుకువెళ్తున్నారని, దాంతో తాము బలహీనపడుతున్నామన్నది తమ్ముళ్ళ ఆవేదన. అలాగే పనుల కేటాయింపుల్లో కూడా ఎమ్మెల్యే తమను పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆయన అల్లుడు, కుమారుడు జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఇసుక, బుసక, మద్యం అమ్మకాలు, చేపల చెరువుల తవ్వకాలు… ఇలా అన్ని ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి జోక్యం ఎక్కువ కావటంతో పాటు టిడిపి నేతలను పూర్తిగా పక్కన పెడుతున్నారట. తమ్ముళ్ల కడుపు మంటకు అది కూడా ఒక కారణం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన టిడిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి సుభాష్ ముందే తమగోడు వెళ్ళబోసుకున్నారు తెలుగుదేశం నాయకులు.ఇక తాజాగా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు కూడా కుమ్ములాటల ప్రస్తావన వచ్చింది. తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే విషయాన్ని లోకేష్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారట. త్వరలోనే ఇన్చార్జిని నియమించి సమస్య పరిష్కరిస్తానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు టీడీపీ నాయకులు. అయితే… అది జరిగి వారమైనా గడవక ముందే… మళ్ళీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి సుభాష్ ముందే మరోసారి కార్యకర్తలు బుద్ధ ప్రసాద్ తీరును నిరసించడం చర్చగా మారింది. కోడూరు, నాగాయలంక మండలాలకు సంబంధించిన నాయకులు ఎక్కువగా ఎమ్మెల్యేపై ఆగ్రహంగా ఉన్నారట. ఈ కుమ్ములాటలకు రెండు పార్టీల అధిష్టానాలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.