Reading Time: 2 minutes
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. ధోనీ సేనలో చేరి రాత మార్చుకున్న స్టార్ క్రికెటర్లు వీళ్లే..!

IPL Cricket News: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సాగే పోరు ఒక హై-వోల్టేజ్ డ్రామా. ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ రెండు జట్లకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ముంబై జట్టులో చోటు దక్కించుకుని ఘోరంగా విఫలమై, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీ ధరించి ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా ఎదిగిన కొందరు క్రికెటర్ల ఆసక్తికర ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

లక్ మారాలంటే ‘పసుపు జెర్సీ’ పడాల్సిందేనా?

క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడి ప్రతిభ కేవలం అతని నైపుణ్యం పైనే కాదు, అతనికి లభించే వాతావరణం, జట్టు యాజమాన్యం ఇచ్చే మద్దతు పైన కూడా ఆధారపడి ఉంటుంది. ముంబై ఇండియన్స్ వంటి అగ్రశ్రేణి జట్టులో ఒత్తిడిని తట్టుకోలేక ఫామ్ కోల్పోయిన కొందరు ఆటగాళ్లు, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని లేదా చెన్నై సూపర్ కింగ్స్ లైనప్‌లోకి రాగానే ఎలా విశ్వరూపం ప్రదర్శిస్తారనేది ఎప్పుడూ ఒక మిస్టరీనే. తాజాగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా సీఎస్కే వైపు చూస్తున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, ముంబైలో విఫలమై చెన్నైలో హీరోలుగా మారిన ఆ ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రత్యేక కథనం.

ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..!

1. మిస్టర్ క్రికెట్ మైఖేల్ హస్సీ: ముంబై వేటు.. చెన్నైలో పరుగుల వరద..!

ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ హస్సీని క్లాస్ ప్లేయర్ అంటారు. టీ20 క్రికెట్‌కు అతను సరిపోడనే విమర్శలను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి పటాపంచలు చేశాడు. చెన్నై జట్టులో ఓపెనర్‌గా వచ్చి పరుగుల వరద పారించిన హస్సీ, 2013 సీజన్‌లో ఏకంగా 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున 50 మ్యాచుల్లో 1768 పరుగులు చేసిన ఈ ‘మిస్టర్ క్రికెట్’, 2014లో ముంబై ఇండియన్స్ జట్టుకు మారాడు. కానీ అక్కడ అతని టైం అస్సలు బాలేదు. ముంబై తరఫున ఆడిన 9 మ్యాచుల్లో కేవలం 209 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ముంబై ఒత్తిడిని తట్టుకోలేకపోయిన హస్సీ, మళ్లీ చెన్నై గూటికే చేరాల్సి వచ్చింది.

2. దీపక్ చాహర్: పసుపు రంగులోనే మెరిసిన స్వింగ్ సుల్తాన్..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పవర్‌ప్లేలో వికెట్లు తీసి పెట్టే ప్రధాన ఆయుధంగా దీపక్ చాహర్ ఎదిగాడు. 2018 నుండి 2024 వరకు చెన్నై విజయాల్లో చాహర్ కీలక పాత్ర పోషించాడు. సీఎస్కే తరఫున 76 మ్యాచుల్లో 76 వికెట్లు తీసి ఎకానమీని అదుపులో ఉంచిన చాహర్, 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లాడు. అయితే ముంబై జెర్సీ వేసుకున్న తర్వాత చాహర్ లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా దెబ్బతింది. వేగం తగ్గడం, భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ముంబై తరఫున ఆడిన 22 మ్యాచుల్లో కేవలం 19 వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా విఫలమయ్యాడు.

ఇది కూడా చదవండి: వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం.. ప్లేయింగ్ 11లో చోటిస్తే చుక్కలే ఇక

3. అన్షుల్ కాంబోజ్: ముంబై వదిలేసింది.. చెన్నై స్టార్‌ను చేసింది!

యంగ్ పేసర్ అన్షుల్ కాంబోజ్ కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. 2024లో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం 3 మ్యాచులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీసిన అన్షుల్‌ను ముంబై యాజమాన్యం తక్కువ అంచనా వేసి వదిలేసింది. కానీ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇతని ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకుంది. ఖలీల్ అహ్మద్ గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని కాంబోజ్ రెండు చేతులా వాడుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై తరఫున ఏకంగా 21 వికెట్లు పడగొట్టి లీగ్‌లోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ముంబై వద్దనుకున్న ఆటగాడు చెన్నైకి వచ్చి మ్యాచ్ విన్నర్‌గా మారడం సీఎస్కే బ్రాండ్ వ్యూహానికి నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..