
తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటలాడింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. ప్రతి రోజూ సగటున 80 వేల మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది.
గతేడాది జూన్ నెలలో రూ.119,85,44,180 హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రాగా 24.08 లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో రూ.128,29,80,410 ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి వచ్చింది. గత ఏడాది జూన్ మాసంతో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో హుండీ ఆదాయం రూ.8,44,36,230 పెరిగింది. టీటీడీ లెక్కల ప్రకారం ఏడాది జూన్ నెల హుండీ ఆదాయం 7.04 శాతం పెరిగినట్లు స్పష్టమవుతుంది. జూన్ నెల లో నాలుగు సార్లు రూ. 5 కోట్లకు పైగా హుండీ ఆదాయం టీటీడీకి వచ్చింది. జూన్ 15న రూ.5,04,50,500 రాగా, జూన్ 23న రూ.5,18,47,600 లు, జూన్ 29న రూ.5,62,84,350 లు, జూన్ 30న రూ.5,30,38,000 హుండీ ఆదాయం టిటిడి ఖాతాకు జమ అయ్యింది.
సమ్మర్లో రికార్డు స్థాయిలో లడ్డు సేల్స్
ఇక జూన్ నెలలో రికార్డు స్థాయిలో 1.27 కోట్ల లడ్డూలను టిటిడి వికరించింది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు గత జూన్ లో రికార్డు స్థాయికి చేరుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచిన టిటిడి ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలను భక్తులకు విక్రయించింది. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయం గణనీయంగా పెరిగింది.
ఇక 2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయించగా 23.55 శాతం వృద్ధి నమోదైంది.
భక్తుల రద్దీకి తగ్గట్టుగానే లడ్డు ప్రసాదం తయారీ
ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది. విస్తృత సేవలతో తిరుమల యాత్ర కు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి