Reading Time: 2 minutes
Ind Vs Eng 2nd T20 Why Is Sanju Samson Being Targeted Over Vaibhav Suryavanshis Debut

Why Sanju Samson targeted over Vaibhav Suryavanshi Debut: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం నెట్టింట పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అయితే అతడి అరంగేట్రానికి ప్రధాన అడ్డంకిగా ఓపెనింగ్ స్థానం మారింది. ప్రస్తుతం ఆ స్థానాల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కొనసాగుతుండటంతో.. వైభవ్‌కు అవకాశం దక్కడం లేదు.

సంజును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?:
టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్.. ఆ తర్వాత ఐపీఎల్‌ 2026లో కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 5, 0 పరుగులు మాత్రమే చేయగా.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒకే పరుగు చేసి నిరాశపరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలంటే.. సంజునే తప్పించాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

సంజూపై విమర్శలు సరైనవి కావు:
అయితే భారత మాజీ వికెట్‌కీపర్, మాజీ సెలెక్టర్ సబా కరీమ్ మాత్రం సంజు శాంసన్‌కు అండగా నిలిచాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుతం సంజును జట్టు నుంచి తప్పించే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశాడు. ‘ఈ దశలో శాంసన్‌ను తప్పించాలని నేను అనుకోవడం లేదు. అతడు అద్భుతమైన మ్యాచ్ విన్నర్. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. అలాంటి ఆటగాడిని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు?. సంజు కూడా అందరూ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ఆలోచించే పరిస్థితి వస్తుంది’ అని సబా కరీమ్ అన్నాడు.

వైభవ్‌కు కూడా ఇదొక మంచి పాఠమే:
వైభవ్ సూర్యవంశీకి వెంటనే అవకాశం రాకపోవడం కూడా అతడి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో స్థానం సంపాదించాలంటే పోటీ ఎంత కఠినంగా ఉంటుందో ఈ అనుభవం ద్వారా అతడు తెలుసుకుంటాడని చెప్పాడు. ‘వైభవ్‌కు ఇది మంచి లెర్నింగ్ సమయం. భారత జట్టులో చోటు సంపాదించాలంటే ప్రతి అవకాశాన్ని సంపాదించుకోవాల్సిందే అనే విషయం ఇప్పుడు అతడికి అర్థమవుతుంది. ఇలాంటి పోటీ వాతావరణం అతడిని కేవలం మంచి క్రికెటర్‌గానే కాకుండా.. మంచి వ్యక్తిగా కూడా తీర్చిదిద్దుతుంది. అతడిలో అపారమైన ప్రతిభ ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సహనంతో ఎదురు చూడడం కూడా చాలా ముఖ్యం’ అని వివరించాడు.

ఐపీఎల్, ఇండియా-ఏలో అదరగొట్టిన వైభవ్:
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇండియా-ఏ తరఫున శ్రీలంక-ఏపై ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.

రెండో టీ20లో అవకాశం వస్తుందా?:
ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇప్పుడు రెండో మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది. సంజు శాంసన్ వరుసగా విఫలమవుతుండటంతో వైభవ్ సూర్యవంశీకి ఈసారి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా? లేక టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి అనుభవానికే ప్రాధాన్యం ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. వైభవ్ ప్రతిభపై ఎలాంటి సందేహం లేకపోయినా.. సరైన సమయం వచ్చినప్పుడే అతడికి అవకాశం ఇవ్వాలన్నదే భారత జట్టు వ్యూహంగా కనిపిస్తోంది.