
భువనేశ్వర్: హార్మూజ్ జలసంధి సమీపంలో కాల్పులను ఎదుర్కొన్న ముడి చమురు నౌక ఎట్టకేలకు ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇరాక్ నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వచ్చిన ఎం.టి.శాన్మార్ హెరాల్డ్ గురువారం భారత తీరానికి చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ వద్ద హెరాల్డ్ నౌకపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నౌక బ్రిడ్జ్ భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
దీంతో భద్రతను దృష్టిలో పెట్టుకుని నౌక తన మార్గాన్ని మార్చుకుంటూ, ఎలాంటి ఇతర భద్రతా సమస్యలు తలెత్తకుండా ప్రయాణం కొనసాగించింది. ఈ విషయాన్ని పారాదీప్ పోర్టు అథారిటీ గురువారం మీడియాకు తెలిపింది. నౌకలో కెప్టెన్తోపాటు మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. కెప్టెన్, సిబ్బంది కలిసి సంక్షోభ పరిస్థితుల్లోనూ నౌకను సేఫ్గా గమ్యానికి చేర్చారని పోర్టు అధికారులు వారిని అభినందించారు