Reading Time: 2 minutes
Kejriwal Slams Bjp Over Ayodhya Ram Temple Donation Row Amit Shah

దేశ వ్యాప్తంగా అయోధ్య రామాలయ విరాళాల వివాదం కుదిపేస్తోంది. కోట్లాది రూపాయల విరాళాలు దారి మళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.200 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ సందర్భంగా ఆప్ అధినేత కేజ్రీవాల్… కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కుంభకోణంతో దేశంలోని ప్రతి సనాతని మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “రామాలయ విరాళాల కుంభకోణం దేశంలోని ప్రతి సనాతని హృదయాన్ని బాధించింది. ఇప్పటివరకు బయటపడింది మంచుకొండలో చిన్న భాగం మాత్రమే. ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. బీజేపీ సనాతనాన్ని కేవలం అధికారం, డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకుంది” అని ఆరోపించారు. దేశంలో సనాతన ధర్మంపై నిజమైన విశ్వాసం ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలకు ఉచిత తీర్థయాత్రలు నిర్వహించామని.. పంజాబ్‌లో కాళీమాత, లవకుశ్ ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని.. భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నామని అన్నారు.

అమిత్ షాపై ప్రశ్నల వర్షం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్ పలు ప్రశ్నలు సంధించారు. “శ్రీరామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి రెండున్నరేళ్లు.. అంటే 891 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో అమిత్ షా ఒక్కసారి కూడా రామాలయాన్ని సందర్శించలేదు. శ్రీరాముడి పేరును అత్యధికంగా రాజకీయాల్లో ఉపయోగించిన వ్యక్తి ఆలయానికి మాత్రం వెళ్లలేదు” అని వ్యాఖ్యానించారు. తాను ఇంటర్నెట్‌లో వెతికానని… పాత్రికేయులతో మాట్లాడానని.. అలాగే చాట్‌జీపీటీని కూడా అడిగానని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘అమిత్ షా తన ప్రసంగాల్లో.. ఇంటర్వ్యూల్లో 42 కంటే ఎక్కువసార్లు రామాలయం పేరును ప్రస్తావించి ఓట్లు అడిగారు. కానీ ఆలయానికి వెళ్లేందుకు మాత్రం సమయం దొరకలేదు” అని విమర్శించారు. ‘‘మీరు ఇప్పటివరకు రామాలయాన్ని ఎందుకు సందర్శించలేదు?, మీకు రామాలయానికి వెళ్లాలనే కోరిక లేదా?, మీకు శ్రీరాముడి ఆశీస్సులు అవసరం లేదా?, మీరు శ్రీరాముడిని దేవుడిగా భావించరా?.’’ అని ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా అమిత్ షా తప్పకుండా ఒకసారి రామాలయాన్ని సందర్శించాలని కేజ్రీవాల్ కోరారు.

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఇదిలా ఉండగా రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన నిందితులందరినీ అయోధ్య స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆలయ విరాళాలు, కానుకల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.