
ఏపీలోని పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం ( జులై 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఇవాళ ఉదయం స్కూల్ బస్సులో ప్రమాదం తప్పింది. నరసరావుపేటకు చెందిన కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కర్లకుంట గ్రామానికి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బస్సులోని ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై బస్సు ఆపి పిల్లలను సురక్షితంగా కిందికి దించాడు.
స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.