Reading Time: 2 minutes
IND vs ENG: ఆ ఇద్దరికి వైభవ్ సూర్యవంశీ గండం.. బుడ్డోడి డెబ్యూతో లగేజీ సర్దేయాల్సిందే..!

India vs England T20I: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ వర్షార్పణం.. ప్రస్తుతం భారత టీ20 జట్టు పరిస్థితి ఇది. ప్రపంచ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న అభిమానులకు ఈ వరుస వైఫల్యాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. శనివారం ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్ టీమ్‌ఇండియాకు చావో రేవో లాంటిది. ఈ నేపథ్యంలో సీనియర్ల వైఫల్యాలు, యువ ఆటగాళ్లపై వస్తున్న విమర్శలు జట్టును కలవరపెడుతున్నాయి.

సంజు శాంసన్‌కు ఇక ఆఖరి అవకాశమేనా?

ఐపీఎల్‌లో అదరగొట్టి, భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన ఓపెనర్ సంజు శాంసన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమై అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. క్రీజులోకి రావడం, అనవసర షాట్లతో వికెట్ పారేసుకోవడం సంజుకు అలవాటుగా మారింది. సాంకేతిక లోపాలను సరిదిద్దుకోలేక అతడు పడుతున్న ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

భారత అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీలు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సైతం వైభవ్‌ను వీలైనంత త్వరగా బరిలోకి దించాలని కోచ్ అభిప్రాయంతో విభేదించాడు. అయితే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్లకే అండగా నిలుస్తామని చెబుతుండటంతో, శనివారం మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి: ఇంగ్లాండ్‌తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!

తిలక్ వర్మ ఆటతీరుపై ఆగ్రహం: స్వార్థపూరిత బ్యాటింగా?

మరోవైపు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చుట్టూ సరికొత్త వివాదం ముసురుకుంది. ఐర్లాండ్‌పై అతడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, అతడు ఆడిన శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టు అవసరాల కంటే తన వ్యక్తిగత రికార్డుల కోసమే తిలక్ నెమ్మదిగా ఆడాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అయితే ఒక అడుగు ముందుకేసి.. తిలక్ వర్మ హీరో కావాలనే తాపత్రయంతో మ్యాచ్‌ను స్లో చేశాడని, దీనివల్లే రన్ రేట్ పెరిగిపోయి భారత్ ఓడిపోయిందని ఘాటుగా విమర్శించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్ రాణించకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే ఉంది. తదుపరి మ్యాచ్‌లోనైనా జట్టును గెలిపించే బాధ్యతాయుతమైన ఫినిషర్ పాత్రను అతడు పోషించాల్సి ఉంది.

శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం ఒక్కటే ఊరట..

వరుస విమర్శల మధ్య కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు ఫామ్‌ అందుకోవడం భారత్‌కు పెద్ద ఊరట. ఐర్లాండ్ పర్యటనలో పూర్తిగా చేతులెత్తేసిన అయ్యర్, ఇంగ్లాండ్‌పై బాధ్యతాయుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ గడ్డపై అర్ధశతకం బాదిన తొలి భారత టీ20 కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఓపెనర్లు విఫలమవుతున్న వేళ కెప్టెన్ ఫామ్‌లోకి రావడం జట్టు మిడిలార్డర్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది.

ఇది కూడా చదవండి: ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ.. అసలు లెక్కలు చూసే ధైర్యముందా..!

బౌలింగ్ విభాగంలో మార్పులు తప్పవా?

ఇంగ్లాండ్ వంటి ప్రమాదకరమైన జట్టును వారి సొంత గడ్డపై అడ్డుకోవడం భారత బౌలర్లకు అంత సులువు కాదు. హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ఇంగ్లండ్ లైనప్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాలు మార్చాల్సిందే. తొలి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ఒక స్పిన్ ఆల్‌రౌండర్, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగింది. అయితే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్‌పై మంచి ప్రతిభ కనబరిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..