Reading Time: 2 minutes
Meil Partners With Analog Ai Industrial Ai Digital Twins

MEIL Enters Industrial: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాల స్థానిక సంస్థ ‘మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా’ (MEIL) ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి ఈ దిగ్గజ సంస్థ అడుగుపెడుతోంది. మైక్రోసాఫ్ట్‌లో రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన ప్రముఖ టెక్ నిపుణుడు అలెక్స్‌ కిప్‌మాన్‌కు చెందిన ‘అనలాగ్‌ ఏఐ’ (Analog AI) సంస్థతో ఎంఈఐఎల్‌ చేతులు కలపనుంది. ఈ మెగా భాగస్వామ్యం ఏ రూపంలో ఉండబోతోంది? ఇందులో ఎంఈఐఎల్‌ ఎంతవరకు పెట్టుబడులు పెట్టనుంది? వంటి కీలక వివరాలన్నీ జూలై 1న కిప్‌మాన్‌తో కలిసి నిర్వహించే ప్రత్యేక సమావేశంలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

ఇది చాట్ జీపీటీ లాంటిది కాదు.. పారిశ్రామిక విప్లవం!

మనం రోజూ చూసే చాట్‌ జీపీటీ, క్లాడ్, లేదా పెర్‌ప్లెక్సిటీ వంటి జనరేటివ్‌ ఏఐ మోడళ్లకు, అనలాగ్‌ ఏఐకి అస్సలు పోలికే లేదు. ఇది ప్యూర్లీ ఒక ఇండస్ట్రియల్ ఏఐ (పారిశ్రామిక ఏఐ). అంటే కేవలం టెక్స్ట్, ఇమేజ్‌లను సృష్టించడం కాకుండా.. భౌతిక ప్రపంచంలో ఇంటెలిజెన్స్‌ను నిర్మిస్తుంది. సెన్సర్లు, రోబోలు, అధునాతన న్యూరల్‌ నెట్‌వర్క్‌లను అనుసంధానిస్తూ.. నిజమైన యంత్రాలకు ప్రతిరూపాలుగా ఉండే డిజిటల్‌ ట్విన్స్‌ (డిజిటల్ నకళ్లు)ను ఇది తయారు చేస్తుంది. పెద్ద పెద్ద వాహనాలు, ఫ్యాక్టరీ యంత్రాలు, పరిశ్రమలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ డిజిటల్ ట్విన్స్ ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని వీటి ద్వారా రిమోట్‌గా పరిశ్రమలను పర్యవేక్షించవచ్చు. ఈ డిజిటల్ నకళ్లు నిరంతరం అప్‌డేట్ అవుతూ, అసలు యంత్రాల పనితీరును ట్రాక్ చేస్తుంటాయి. దీనివల్ల యంత్రాలలో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో ముందే ఊహించి, ప్రమాదాలు లేదా బ్రేక్‌డౌన్‌లు జరగకుండా నివారించే అద్భుత అవకాశం లభిస్తుంది.

దిగ్గజాలకు గట్టి పోటీ.. భవిష్యత్తు అంతా దీనిదే!

సీమెన్స్, స్నీడర్, జీఈ వెర్నోవా, రాక్‌వెల్‌ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఏళ్లుగా ఏలుతున్న ఈ పారిశ్రామిక ఏఐ రంగంలోకి.. ఒక ప్యూర్ ఏఐ కంపెనీగా అనలాగ్‌ ఏఐ ఎంట్రీ ఇచ్చింది. అబుదాబికి చెందిన టెక్నాలజీ లీడర్ ‘జీ24’ (G24) ఈ సంస్థకు అవసరమైన పూర్తి ఆర్థిక చేయూతను అందిస్తుండటంతో, దీని మార్కెట్ విలువను ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. రాబోయే పదేళ్లలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 శాతానికి పైగా భారీ పరిశ్రమలు తమ కీలక ఆపరేషన్ల కోసం ఈ డిజిటల్‌ ట్విన్స్‌ సాంకేతికతనే వాడబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం మాన్యుఫ్యాక్చరింగ్ రంగమే కాకుండా.. విద్యుత్, చమురు-గ్యాస్, రైల్వేస్, మెట్రో వ్యవస్థలు, పోర్టులు-షిప్పింగ్, మైనింగ్, అలాగే నిర్మాణ రంగాలలో ఈ పారిశ్రామిక ఏఐ సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. అలాంటి భవిష్యత్తు ఉన్న రంగంలోకి ఎంఈఐఎల్‌ అడుగుపెడుతుండటం ఇప్పుడు టెక్ ముఖచిత్రాన్ని మార్చేసే అంశంగా మారింది.