
Dulquer Salmaan: ఖరీదైన లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కు కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించి, ఈ వ్యవహారానికి సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లగ్జరీ కార్ల స్కామ్లో దుల్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అసలు కేసు ఏంటంటే..
భూటాన్ ఆర్మీ తమ వాహనశ్రేణి నుంచి ఉపసంహరించుకున్న కొన్ని అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను కొందరు కేటుగాళ్లు, ఏజెంట్లు వేలంలో అతితక్కువ ధరకు దక్కించుకున్నారు. ఆ వాహనాలకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ (పన్ను) చెల్లించకుండా, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లోకి స్మగ్లింగ్ చేశారు. ఈ విధంగా అక్రమంగా తీసుకొచ్చిన లగ్జరీ కార్లను దేశంలోని సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో కస్టమ్స్ శాఖ రంగంలోకి దిగింది.
‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ప్రకంపనలు..
గత ఏడాది సెప్టెంబర్లో కేరళ అంతటా కస్టమ్స్ అధికారులు ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ నివాసంలోనూ సోదాలు నిర్వహించి, ఆయన గ్యారేజీలో ఉన్న కొన్ని అనుమానాస్పద లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించారు. దుల్కర్ వద్ద ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు కలిగిన ఇతర వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ వివాదంపై దుల్కర్ సల్మాన్ ఇప్పటికే కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన వద్ద ఉన్న ‘ల్యాండ్ రోవర్’ కారు స్మగ్లింగ్ చేసింది కాదని, అన్ని నిబంధనలకు లోబడే దానిని కొనుగోలు చేశానని ఆయన కోర్టుకు తెలిపారు. కస్టమ్స్ క్లియరెన్స్, ఇన్వాయిస్ తదితర డాక్యుమెంట్లు అన్నీ తన వద్ద పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ కార్ల దిగుమతి వెనుక భారీగా ఆదాయపు పన్ను (IT), జీఎస్టీ (GST) ఎగవేతలతో పాటు పెద్ద ఎత్తున నగదు అక్రమ చలామణి జరిగినట్లు కస్టమ్స్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ కేసు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.