Reading Time: 2 minutes
Saudi Arabia Attends Khamenei Funeral Signals Shift In Iran Us Relations

ఇరాన్‌లో ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా దేశాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా అమెరికా మిత్రపక్షం సౌదీ అరేబియా హాజరు కావడంతో సంచలనంగా మారింది. నిన్నామొన్నటి దాకా సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ.. ఆశ్చర్యంగా శుక్రవారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరై ఆశ్చర్యపరిచారు.

ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ అరేబియా ప్రతినిధిని పంపడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా-ఇరాన్ ఘర్షణల తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సౌదీ అరేబియా ఉప విదేశాంగ మంత్రి టెహ్రాన్‌కు వెళ్లి ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడం కీలక దౌత్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రారంభంలో ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యే దేశాల జాబితాలో సౌదీ అరేబియా పేరు లేకపోవడం గమనార్హం. ఒమన్, ఖతార్ వంటి దేశాలు అమెరికా-ఇరాన్ చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో వాటి ప్రతినిధుల హాజరు ముందుగానే ఖరారైంది. అయితే చివరి నిమిషంలో సౌదీ ప్రతినిధి రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఎందుకు కీలకం?

ఇటీవలి అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా సైనిక చర్యలకు సౌదీ అరేబియా మొదట వ్యతిరేకించినప్పటికీ.. అనంతరం అమెరికాకు పరిమిత స్థాయిలో వైమానిక స్థావరాలు, గగనతల వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. అమెరికా సంబంధిత లక్ష్యాలపై దాడులు చేయగా, సౌదీ అరేబియా కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అంతేకాకుండా ఇటీవల అమెరికా-సౌదీ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్‌పై యుద్ధం చేయాలన్న అమెరికా నిర్ణయంపై రియాద్ అసంతృప్తిగా ఉందని, సౌదీలోని అమెరికా సైనిక బలగాల సంఖ్యను తగ్గించే అంశాన్ని వాషింగ్టన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దశాబ్దాల ప్రత్యర్థులు

సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య దశాబ్దాలుగా వ్యూహాత్మక పోటీ కొనసాగుతోంది. యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాల్లో ఇరు దేశాలు ప్రత్యర్థి వర్గాలకు మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే 2023లో చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నప్పటికీ.. పరస్పర అనుమానాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ ప్రతినిధిని పంపడం సాధారణ సంతాప కార్యక్రమం కంటే.. రాజకీయ, దౌత్యపరంగా కీలక సందేశంగా భావిస్తున్నారు.

సౌదీ ఏం సంకేతం ఇచ్చింది?

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం ద్వారా సౌదీ అరేబియా ఇరాన్‌తో కమ్యూనికేషన్ మార్గాలను కొనసాగించాలని, మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అలాగే ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం నాయకత్వంలో ఇరాన్ ఎలా ముందుకు సాగుతుందనే అంశాన్ని రియాద్ నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై కూడా సౌదీ దృష్టి కేంద్రీకరించినట్లు భావిస్తున్నారు.

టెహ్రాన్‌కు ప్రపంచ నేతలు

ఖమేనీ అంత్యక్రియలకు దాదాపు 30 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ టెహ్రాన్ చేరుకుని నివాళులర్పించారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే చైనా, కాకసస్ ప్రాంత దేశాలు సహా పలు దేశాలు తమ ప్రతినిధులను పంపించాయి.

భారీ భద్రత.. లక్షలాది మంది హాజరు

టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్, ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ వహీది తదితరులు నివాళులర్పించారు. ఈ అంత్యక్రియలకు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమంగా నిలిచే అవకాశం ఉంది. టెహ్రాన్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులు మూసివేయడంతో పాటు గగనతల రాకపోకలపై కూడా పరిమితులు విధించారు. టెహ్రాన్ కార్యక్రమాల అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని ఖోమ్, నజఫ్, కర్బలా నగరాలకు తీసుకెళ్లి, చివరకు జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రెజా దర్గాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మధ్యప్రాచ్యంలో మారుతున్న శక్తి సమీకరణాల నేపథ్యంలో సౌదీ అరేబియా తీసుకున్న ఈ అనూహ్య దౌత్య నిర్ణయం భవిష్యత్ ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.