Reading Time: 2 minutes
Otr Ntv Telugu Telagana Cm Revanth Reddy

తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్‌ రాబోతున్నాయా? నో జంబోస్‌…. ఓన్లీ కాంబోస్‌ అని సెక్యూరిటీ వింగ్‌ అంటోందా? ప్రోటోకాల్‌, వీఐపీ పాస్‌ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా ఛేంజెస్‌? రెండున్నరేళ్ళ తర్వాత సడన్‌గా ఇప్పుడెందుకు మార్పులు చేస్తున్నారు? . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొనే సభావేదికల విషయంలో…కీలకమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్‌ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మీదట ప్రోటోకాల్ ఉన్న వారు మాత్రమే వేదిక మీద కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న జంబో సిస్టంను పూర్తిగా మార్చివేయబోతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, శంకుస్దానలకు ప్రభుత్వం, పార్టీ తరుపున సభలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోకంటే భిన్నంగా….. సీఎం కూర్చునే సభా వేదికపై ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నారు.

కానీ… అదే ఇప్పుడు సీఎం సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారడంతో పాటు ప్రోటోకాల్ వివాదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతల అత్యుత్సాహంతో సెక్యూరిటీ అధికారులు బాగా ఇబ్బంది పడుతున్నారట. భద్రతా పరంగా వరుస వివాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు దిద్దుబాటు మొదలుపెట్టినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ హయాంలో సీఎం కూర్చునే వేదిక మీద… నిర్దేశించిన కొందరు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇతర ముఖ్య నేతలకు వేదిక ఎదురుగా ప్రత్యేకంగా వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేసేవారు. దాంతో… ప్రజాప్రతినిధులు అందరికీ సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే విమర్శలు అప్పట్లో ఉండేవి. తమ ప్రభుత్వంలో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనుకున్న సీయం రేవంత్ రెడ్డి… తాను పాల్గొనే సభల్లో వేదికల మీద అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు, స్దానిక నేతలకు కూడా అవకాశం ఇవ్వాలని సూచించారట. దాంతో… వేదికపై కూర్చునే వారి సంఖ్య పెరిగి జంబో అయింది. సీఎంతో సహా… మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరికీ ఒకే రకమైన కుర్చీలు వేయడం, మిగిలిన ప్రజా ప్రతినిధులకు కూడా సెక్యూరిటీ అభ్యంతరాలు లేకుండానే వేదిక మీద కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే… ఈ అవకాశాన్ని కొందరు నేతలు దుర్వినియోగం చేస్తున్నట్టు తాజాగా బయటపడుతోందట. వేదిక మీదున్న వాళ్ళు అత్యుత్సాహంతో సెక్యూరిటీని దాటుకొని సీఎంను కలవడానికి దూసుకు రావడం, శాలువాలు కప్పడం, వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ఆయన వేదిక ఎక్కే, దిగే సమయంలో సెక్యూరిటీ సూచనలు పట్టించుకోకుండా అతి చేస్తున్నట్టు గ్రహించారు అధికారులు. ఇలాంటివన్నీ బాగున్నంతవరకు బాగానే కనిపిస్తాయిగానీ…. రేపు ఏదైనా చిన్న తేడా జరిగితే ఏంటన్నది భద్రతా అధికారుల ప్రశ్న. అందుకే కంట్రోల్‌ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.

వేదికపై కూర్చునే నేతల జాబితా తయారీలోనూ, పాస్‌ల జారీ విషయంలోనూ సీయం సభ జరిగే ప్రాంత స్థానిక నేతల అతి జోక్యం కారణంగా… సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గుర్తించారట అధికారులు. ఇందుకు గత ఆదివారం నల్లగొండలో సీఎం సభ ముగిశాక వేదికపై చోటుచేసుకున్న ఘర్షణనే ఉదహరణగా చూపిస్తున్నారు. వేదిక మీద ఘర్షణ, ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింతను సెక్యూరిటీ ఆఫీసర్స్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించిన పోలీసు అధికారులు వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మెల్లిగా ఎన్నికల వేడి కూడా రాజుకుంటున్న క్రమంలో… ఇక నుంచి సీఎం భద్రత విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తోంది సెక్యూరిటీ వింగ్‌. అనుమతి లేని వ్యక్తులు వేదికల మీదికి రాకుండా కఠినంగా వ్యవహరించాలని, ప్రోటోకాల్‌ను పక్కాగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీచేసినట్టు సమాచారం. వేదిక మీద కూర్చునే వారి సంఖ్యను కూడా పరిస్థితినిబట్టి వీలైనంత కుదించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.