
ఆపదలో ఆదుకోవడానికి ఏ బంధాలు అవసరం లేదు.. కేవలం మానవత్వం ఉంటే చాలు అని నిరూపించింది ఓ ఆశ్రమ పాఠశాల వార్డెన్. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గిరిజన విద్యార్థినిని కాపాడటం కోసం.. ఆ వార్డెన్ తన వీపుపై డోలి కట్టుకుని, ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన కొండ దారుల్లో మోసుకెళ్లింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక, స్ఫూర్తిదాయక ఘటన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన భువనేశ్వరి అనే బాలిక భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కొంతకాలం క్రితం తండ్రి మరణించడంతో చిన్నాన్న సంరక్షణలో ఉంటూ చదువు కొనసాగిస్తోంది. ఇటీవలే సెలవులకు ఇంటికి వెళ్లిన భువనేశ్వరికి తీవ్రమైన జ్వరం రావడంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కొద్దిగా నయం కావడంతో ఇంటికి తీసుకెళ్లారు. కానీ కొద్దిరోజులకే బాలిక ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. సమాచారం అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారి రజని వెంటనే స్పందించి, ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమను బాలిక ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
వాహనాలు లేవు.. 6 కిలోమీటర్లు వీపుపైనే..
వార్డెన్ హేమ వెంటనే వాడపుట్టి గ్రామానికి చేరుకుని బాలిక పరిస్థితిని గమనించారు. ఆలస్యం చేస్తే చిన్నారి ప్రాణాలకే ప్రమాదమని గ్రహించి, వెంటనే ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. అయితే ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కనీసం బైక్ వెళ్లేందుకు కూడా దారి లేకపోవడంతో వార్డెన్ హేమ వెనకడుగు వేయలేదు. చిన్నారి ప్రాణమే ముఖ్యమని భావించి.. బాలికను తన వీపుపై డోలి లాగా కట్టుకుని.. కొండ దారులు, కాలిబాటల మీదుగా సుమారు 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ నెల్లికెక్కువ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనాన్ని ఏర్పాటు చేసి భువనేశ్వరిని పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సొంత బిడ్డలా చూసుకుంది.. శభాష్ హేమ..
ప్రస్తుతం పార్వతీపురం ఆసుపత్రిలో వైద్యులు బాలికకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా కన్న తల్లిలా భావించి ఆపదలో ఉన్న విద్యార్థినిని కాపాడిన వార్డెన్ హేమ సేవాభావంపై అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రజల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఘటన వార్డెన్ మానవత్వాన్ని చాటినప్పటికీ.. డిజిటల్ యుగంలోనూ ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాల దయనీయ స్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. అత్యవసర వైద్య సేవలు కావాలన్నా రోగులను భుజాలపై, డోలీలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితులు రావడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వైద్య సేవలు మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.