
ఉత్తరప్రదేశ్లో ఓ ఆరేళ్ల చిన్నారి పరిస్థితి ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తల్లి క్యాన్సర్తో మృతి చెందడంతో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆ బాలుడు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు వారంలో కొన్ని రోజులు తండ్రి వద్ద, మిగతా రోజులు అమ్మమ్మ-తాతల వద్ద గడపాల్సి వస్తుండటంతో.. అతని చదువు కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
బాలుడి సంరక్షణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో కోర్టు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం చిన్నారి వారంలో నాలుగు రోజులు తన అమ్మమ్మ, తాతల వద్ద ఉండగా.. మిగిలిన మూడు రోజులు తండ్రి వద్ద గడుపుతున్నాడు. దీంతో అతని జీవితం ప్రతి వారం రెండు ఇళ్ల మధ్యే సాగుతోంది. అయితే అసలు సమస్య చదువు విషయంలో తలెత్తింది. తండ్రి తన వద్ద ఉన్న ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాలుడిని మొదటి తరగతిలో చేర్పించాడు. మరోవైపు అమ్మమ్మ, తాతలు తమ ప్రాంతంలోని మరో పాఠశాలలో ఎల్కేజీలో అడ్మిషన్ కల్పించారు. ఫలితంగా ఆ చిన్నారి వారంలో మూడు రోజులు ఒక స్కూల్లో ఎల్కేజీ తరగతులకు హాజరవుతుండగా.. మరో మూడు రోజులు మరో స్కూల్లో మొదటి తరగతి చదవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
ఇరు ఇళ్ల మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణం కూడా బాలుడికి అదనపు భారంగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిలబస్లు, రెండు పాఠశాలల వాతావరణానికి అలవాటు పడాల్సి రావడంతో అతని మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణం తర్వాత ప్రేమ, ఆప్యాయతతో ఎదగాల్సిన వయసులో ఈ చిన్నారి రెండు కుటుంబాల మధ్య జీవితం గడపాల్సి రావడం హృదయవిదారకంగా మారింది. బాలుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు పరస్పర అవగాహనతో వ్యవహరించాలని, అతని విద్యకు ఆటంకం కలగకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి శ్రేయస్సే ప్రధానంగా భావించి, అతని విద్య, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు తగిన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.