Reading Time: < 1 minute
Mahua Moitra Egg Attack Outside West Bengal Eatery Protest

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు ఆగడం లేదు. ఆ మధ్య మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు. అలాగే మహిళా ఎంపీ మహువా మొయిత్రాను విమానంలో ఎగతాళి చేశారు. దొంగ.. దొంగ అంటూ అభ్యంతర పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

తాజాగా మరోసారి మహువా మొయిత్రాపై గుడ్ల దాడి జరిగింది. బుధవారం ఓ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తుండగా కొందరు నిరసనకారులు ఎంపీపై గుడ్లు విసురుతూ నినాదాలు చేశారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి మహువా మొయిత్రాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆశ్చర్యంగా పోలీసుల సమక్షంలోనే చాలా మంది నిరసనకారులు కోడిగుడ్లు విసిరారు. వీడియోలో కనిపించింది. ఇది పోలీసుల వైఫల్యం అని ఎంపీ ఆరోపించారు.

అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? వారి నిరసనకు కారణమేంటి? అనే విషయాలు ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని భయపెట్టేందుకు చేసిన ప్రయత్నమని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.