Reading Time: 2 minutes
Brs Internal Rift In Nagarjuna Sagar Mc Kotireddy Vs Nomula Bhagat Political Battle Intensifies

OTR: సాగర సమరం జోరుగా జరుగుతోందా? ఇన్నాళ్ళు నడిచిన కోల్డ్‌వార్‌ ఇక ఓపెన్‌ అయిపోయిందా? పైచేయి కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే చేస్తున్న యుద్ధం గులాబీ గూట్లో సెగలు రేపుతోందా? ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేక కేడర్‌ సైతం గందరగోళంలో పడ్డ పరిస్థితులు ఎక్కడున్నాయి? ఎవరి మధ్య జరుగుతోందా యుద్ధం?

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మధ్య కోల్డ్ వార్ అంతకంతకూ పెరుగుతోంది. ఇది లోకల్‌గా బీఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పి అవుతోందంటున్నారు. మూడున్నరేళ్ళుగా ఇద్దరి మధ్య పెరుగుతున్న గ్యాప్‌తో కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు, క్యాడర్‌కు భరోసా ఇచ్చేందుకు ఒక్కరోజు కూడా ఇద్దరూ కలిసి పనిచేయలేదట. దీంతో నియోజకవర్గంలో గులాబీ పరిస్థితి
రోజురోజుకూ దిగజారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ విభేదాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయనేది ఉద్యమ నేపధ్యం ఉన్న క్యాడర్ వర్షన్. గతంలో సాగర్ ఉపఎన్నిక సమయంలో ఈ కోల్డ్ వార్‌కు బీజం పడగా…. ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యాక ఈక్వేషన్స్‌, కేలిక్యులేషన్స్‌ అన్నీ మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేయాలని అధిష్టానం ఒకటికి రెండు సార్లు సూచించినా, హెచ్చరించినా సయోధ్య మాత్రం కుదరలేదు. సాగర్‌లో బీఆర్‌ఎస్‌ ఓటమికి అదికూడా ఒక కారణమని చెబుతారు. ఆ దెబ్బకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీ అవగా… కోటిరెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకు మరో ఏడాదిన్నర పదవీకాలం ఉంది. పార్టీ ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాలు వాళ్ళవే… ఎవరి క్యాడర్ వాళ్లదే.

ప్రతి మండలంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేకు సపరేట్‌గా క్యాడర్ ఉండటంతో.. ఎవరి సమావేశాలు వాళ్లు నిర్వహించుకుంటున్నారు. పైగా ఒకరి మీటింగ్స్‌ వైపు మరొకరు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. చివరికి హైదరాబాద్‌లో పార్టీ పెద్దలు నిర్వహించే మీటింగ్‌లకు సైతం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం ఎవరి గాడ్‌ఫాదర్స్‌ని వాళ్ళు కలవడం రోటీన్‌గా మారిపోయింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఏ వర్గంలో ఉండాలో, ఎటు పోతే ఎవరికి కోపం వస్తుందోనన్న గందరగోళంలో ఉంటున్నారట. ఈ కారణంగానే…. హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కోల్పోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం కేడర్‌లో ఉంది. కలిసి పని చేయాల్సిన సమయంలో కత్తులు దూసుకోవడం వల్లే ఫలితం చేదుగా ఉందని అంటున్నారు. తాజా ఎస్‌ఐఆర్‌ సన్నాహాక సమావేశాలను సైతం ఎవరికి వారే సపరేట్‌గా నిర్వహించుకున్నారు.

నియోజకవర్గ స్దాయి సమావేశానికి మాత్రం ఇద్దరూ హాజరైనా… పరిచయం లేనట్టే వ్యవహరించారట. తన పదవీ కాలం పూర్తయ్యే నాటికి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎమ్మెల్యే టిక్కెట్‌ రేసులోకి వెళ్లేందుకు ఎంసీ కోటిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా పవర్‌ ఉండటంతో క్యాడర్‌ కూడా కాస్త ఆయనవైపే మొగ్గుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారట ఆయన.

అటు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ కూడా సామాజిక సమీకరణల లెక్కలు వేసుకుంటూ ఈసారి కూడా టిక్కెట్‌ నాదేనని అంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల కోసం ఆచితూచి వేస్తున్న అడుగులు, వేస్తున్న ఎత్తుగడలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. పార్టీ లైన్లో లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, యాక్టివ్‌గా ఉంటూ ప్రజాభిమానాన్ని, క్యాడర్ విశ్వాసాన్ని చూరగొన్నవాళ్ళకే టికెట్లు ఇస్తామని ముఖం చూసి ఇచ్చే ప్రసక్తే లేదని పార్టీ అధినేత కుండబద్దలు కొట్టిన క్రమంలో ముందు ముందు సాగర్ మధనం ఎలా జరుగుతుందోనని గులాబీ కేడర్లో చర్చ జరుగుతోంది.