
108 Ambulances at District Courts: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల వద్ద అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ALS) సౌకర్యం కలిగిన ‘108’ అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కోర్టు వద్ద ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 108 అంబులెన్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవల నిర్వహణ కోసం ఏటా రూ.3.93 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక, అదనంగా, సీఆర్డీఏ పరిధిలోని రాయపూడి, ఐనవోలు, ఉండవల్లి ప్రాంతాల్లో కూడా మరో మూడు కొత్త 108 అంబులెన్సులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కోర్టులకు వచ్చే న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడనుంది.